
ఎరువుల సరఫరా ఏకపక్షం
● కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ● రైతన్నకు తప్పని ఎరువు కష్టాలు
ఆమదాలవలస రూరల్:
అన్నదాతకు అందాల్సిన ఎరువులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువుల సరఫరా ఏకపక్షంగా జరుగుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ఎరువులు చేరడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే పూర్తిగా ఎరువులు అందే పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా అధికారులు కూ డా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తొలిదశలో రైతు సేవా కేంద్రాల ద్వారా కొంత సరఫరా చేసినా ఆ తర్వాత మొత్తం ఎరువులు వ్యాపారులకు అందించటంతో ఎరువు కరువుగా మారింది.
గగ్గోలు పుట్టిస్తున్న ధరలు
ఎరువుల వ్యాపారులు అధికార పార్టీ నాయకులు అండదండలతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న సంగతి చాలా చోట్ల బయటపడింది. ఒక యూరియా బస్తాపై రూ. 100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుంటున్నారు. కాంప్లెక్స్ ఎరువులపైనా ఇదే స్థాయిలో దోపిడీ జరుగు తోంది. ముఖ్యంగా ఆమదాలవలసలో రైల్వేగూడ్స్ షెడ్ ఉండటం, ఇందుకు దగ్గరలో గోదాంలు కూడా ఉన్నందున వ్యాపారుల వ్యాపారం మూడుపువ్వు లు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇంత అక్రమాలు జరుగుతున్నా ఇక్కడ అధికారులు కనీసం తనిఖీ చేసేందుౖకైనా ముందుకు రావడం లేదు. నిఘా విభాగం సైతం నిద్ర నటిస్తోంది.
తప్పని నిరీక్షణ
బూర్జ: మండలంలో గల నీలాదేవిపురం (నీలంపేట) గ్రామ రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం నుంచి శనివారం 222 బస్తాల యూరియా వచ్చింది. నీలాదేవిపురంతో పాటు వావాం, ఉవ్వపేట, బూర్జ నుంచి రైతులు రావడంతో తోపులాట జరిగింది. అధికారులు పోలీసు సహాయం కోరడంతో ఎస్ఐ ఎం.ప్రవల్లిక సిబ్బందితో రైతులను క్యూలో నిలబెట్టారు.

ఎరువుల సరఫరా ఏకపక్షం