
చికిత్స పొందుతూ యువకుడు మృతి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఒక బంగారు దుకాణంలో పనిచేస్తున్న యువకుడు కడుపునొప్పి తాళలేక విషంతాగి చికిత్స పొందుతూ మృతి చెందాడని రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు బుధవారం తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంతకవిటి మండలం జీఎంపురం గ్రామానికి చెందిన గురుగుబెల్లి పృథ్వీరాజ్ (25) నగరంలోనే అద్దె ఇంట్లో ఉంటూ షాపులో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా తీవ్రంగా కడుపు నొప్పి వేధిస్తుండడంతో రెండు రోజుల క్రితం విషం తాగాడు. విషయం తెలిసిన బంధువులు ముందుగా రిమ్స్లో చేర్చారు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతి చెందడంతో మృతుని మేనమామ టి.జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
నరసన్నపేట: జాతీయ రహదారిపై మండలంలోని తామరాపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం పట్టణంలోని ఆదివారంపేటకు చెందిన దమ్ము నూకాలమ్మ(62) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలు నూకాలమ్మ తన కుమారుడు సుధాకర్తో కలిసి ద్విచక్ర వాహనంపై కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో ఒక శుభ కార్యక్రమానికి వెళ్లింది. తిరిగి స్వగ్రామం ఆదివారంపేటకు వెళ్తుండగా తామరాపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న స్పోర్ట్ బైక్ వెనుక నుంచి బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న నూకాలమ్మ తీవ్రగాయాలకు గురవ్వడంతో 108లో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో ఆమె మృతి చెందారని ఏఎస్ఐ అశిరినాయుడు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో సుధాకర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అందుబాటులోకి వ్యాక్సిన్లు
టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో పలుమార్లు సాక్షిలో వెలువడిన కథనాలకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కె.కొత్తూరు పీహెచ్సీ ఆరోగ్య సిబ్బంది అధ్వర్యంలో ఐపీవీ, డీపీటీ, ఎంఆర్, రోటా, ఓపీవీ ఇతర వ్యాక్సిన్లు చిన్నారులకు వేశారు.