
బూతులు తిట్టి.. కాలర్ పట్టుకుని నెట్టేసి
రణస్థలం: కూటమి నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. జనంపై పెత్తనం చెలాయించడమే కాకుండా ఉద్యోగులను కూడా వేధిస్తున్నారు. తాజా గా జనసేన పార్టీ రణస్థలం మండలాధ్యక్షుడు బస్వ గోవిందరెడ్డి ఈ నెల 20వ తేదీన కొచ్చెర్ల గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కె.మోహన్రావుపై దాడికి తెగబడడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
ఈ నెల 20వ తేదీన మోహనరావు ఉదయం 10.30 గంటలకు సచివాలయానికి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. ఆ సమయంలో బస్వ గోవిందరెడ్డి సచివాలయానికి వచ్చి గతంలో తాను చెప్పి న పని ఏం చేశావని గట్టిగా అడిగాడు. యోగాంధ్ర, తల్లికి వందనం వంటి పనుల్లో బిజీగా ఉన్నానని, ఆ పని పంచాయతీ కార్యదర్శి లాగిన్లో ఉందని సమాధానం చెప్పినా వినకుండా తాను చెప్పిన పని ముందు చేయకుండా మిగతా పనులు చేసుకుంటావా అని బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా కాలర్ పట్టుకుని నెట్టేశారు. ఆ సమయంలో సచి వాలయంలో మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉన్నారు. ఈ అనుకోని ఘటనతో తీవ్రంగా మనస్తాపం చెందిన మోహనరావు ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. సోమవారం తోటి ఉద్యోగులతో కలిసి మండల పరిషత్ ఏఓ మార్కండేయకు వినతి పత్రం ఇచ్చారు.
గోవిందరెడ్డి అంటే అధికారులకు హడల్
జనసేన మండలాధ్యక్షుడు బస్వ గోవిందరెడ్డి ఓ రౌడీ షీటర్. అతనిపై పలు కేసులు ఉన్నాయి. గతంలో ఒక కుటుంబం వద్ద నగదు తీసుకుని చెల్లించకపోగా ఆ కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేయడంపై అప్పట్లో కేసు నమోదైంది. ఇక కొచ్చెర్ల గ్రామ సచివాలయంపై ఉద్యోగులపై ఎన్నో మార్లు చిందులు తొక్కిన ఘటనలు ఉన్నాయి. 2022 సమయంలో గ్రామ సచివాలయ భవనాలు కడుతున్న సమయంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరిపై ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ నానా యాగీ చేశాడు. జగనన్న కాలనీ లబ్ధిదారులపై దాడి, కొచ్చెర్ల ప్రేమ జంటతో పాటు వాళ్ల కుటుంబం పైన దాడి వంటి అనేక కేసులున్నాయి.
సచివాలయ ఉద్యోగిపై జనసేన నాయకుడు బస్వ గోవిందరెడ్డి దౌర్జన్యం
అతడు ఇదివరకే పలు కేసుల్లో నిందితుడు