
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
పాఠశాల భవనం నిర్మించాలి
తమ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్వహించేందుకు నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పోలాకి మండలం దీర్ఘాశి గ్రామ పంచాయతీ కింజరాపువానిపేటకు చెందిన ప్రజలు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. తమ గ్రామంలో 100 కుటుంబాలకు పైగా ఉన్నాయని, ప్రస్తుతం పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం గ్రామస్తులే చందాలు వేసుకొని అద్దె కట్టి పాఠశాల నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నూతన భవనాన్ని మంజూరు చేయాలని విన్నవించారు. అలాగే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో ఉన్న పిల్లలు ఐదో తరగతి వరకు ఇక్కడే చదివేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, సర్వే, భూగ ర్భ గనులు, ఇరిగేషన్ తదితర శాఖల సమస్యలు ఉన్నాయి. అర్జీలు స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయా శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అర్జీలపై సమీక్షించారు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పింఛన్లు పునరుద్ధరించాలి
ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం కటకమయ్యపేట గ్రామంలో ఇద్దరు వితంతువులకు నిలిపివేసిన పింఛన్లను పునరుద్ధరించాలని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. వితంతువులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా పింఛన్లు పొందుతున్నప్పటికీ కేవలం రాజకీయ కారణాలతో గత 8 నెలలుగా పింఛన్ నిలిపివేశారని తెలియజేశారు. అధికారులు స్పందించి ఆ నిరుపేదలను ఆదుకోవాలని కోరారు.
అక్రమ ఇసుక ర్యాంపుల నిర్వహణ ఆపాలి
శ్రీకాకుళం రూరల్ మండలం నైర గ్రామం పరిసరాల్లోని వంశధార నదిలో అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారని, వాటిని నిలుపుదల చేయాలని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం మండల ప్రధాన కార్యదర్శి ఊటపల్లి కృష్ణారావు కోరారు. నైర గ్రామ పరిధిలో వంశధార నుంచి వాటర్ స్కీమ్లు ఏర్పాటు చేశారని, ఈ అక్రమ తవ్వకాల వలన ప్రాజెక్టుకు నష్టం జరిగే పరిస్థితి ఉందని తెలిపారు. వాల్టా చట్టం పరిధిలో అక్రమ ఇసుక ర్యాంపులు ఆపాలని విన్నవించారు. శ్రీకాకుళం మండలానికి 20 సంవత్సరాల నుంచి 75 శాతం మంది ప్రజలకు తాగునీరు సక్రమంగా దానినుంచే అందుతోందని తెలిపారు.
జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు
మీకోసంలో 106 అర్జీల స్వీకరణ

అర్జీలు సత్వరమే పరిష్కరించాలి