
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నందిగాం: మండల పరిధిలోని మద్దిలివానిపేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేంద్రపురం పంచాయతీ నారాయణపురానికి చెందిన మెట్ట లోకనాథం(55) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లోకనాథం తన పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్లి తిరిగి నారాయణపురం గ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. అయితే అదే సమయంలో పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్పై నుంచి ఎగిరిపడి రోడ్డు మీద పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లీలావతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.