సిక్కోలు వాకిట్లో సిండికేట్ల రాజ్యం | Liquor belt shops scattered in Srikakulam district: Andhra pradesh | Sakshi
Sakshi News home page

సిక్కోలు వాకిట్లో సిండికేట్ల రాజ్యం

Jun 24 2025 5:12 AM | Updated on Jun 24 2025 5:12 AM

Liquor belt shops scattered in Srikakulam district: Andhra pradesh

లైసెన్సు దుకాణం వెనుక పర్మిట్‌ రూమ్‌లో మద్యం సేవిస్తున్న మందుబాబు

నేతలకు ముడుపులు... మందుబాబులకు వాతలు 

ఇష్టారీతిన మద్యం అమ్ముకునేందుకు పచ్చ జెండా

విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు, పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటు 

జిల్లాలో 10 వేలకు పైగా బెల్ట్‌షాపులు 

క్వార్టర్‌పై రూ.30 నుంచి 50 వరకు అదనపు బాదుడు 

లైసెన్స్‌ దుకాణాల్లో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు

తాగు నీరు దొరకని గ్రామాలు ఉన్నాయేమో గానీ మద్యం దొరకని చోటు లేదు... వేల సంఖ్యలో బెల్టు షాప్‌లు... దర్జాగా లిక్కర్‌ దందా... ఎవరికి అందాల్సిన మొత్తం వారికి... వాటాలు కుదరనిచోట నెలవారీ ముడుపులు..! సిక్కోలు వాకిట్లో ఇదీ మద్యం సిండికేట్ల రాజ్యం..! మద్యం ద్వారా ఆదాయం ముంచెత్తాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు గేట్లు ఎత్తారు...!

శ్రీకాకుళం జిల్లాలో మద్యం షాపుల నిర్వాహకులు, సిండికేట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షాప్‌ పరిధిలోని గ్రామాల్లో 10 నుంచి 
40 బెల్ట్‌ షాప్‌లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 10 వేలపైనే అని అంచనా. ఇవన్నీ బార్లను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల నివాస గృహాలు, చిన్న చిన్న దుకాణాల్లోనూ మద్యం దొరుకుతోంది. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనంగా అమ్ముతున్నారు. కొన్నిచోట్ల లైసెన్స్‌ దుకాణాల కౌంటర్లలోనే రూ.10 నుంచి రూ.20 వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. వైన్‌ షాప్‌లు, బార్‌లలో నిర్దేశిత వేళల్లో మద్యం దొరుకుతుంటే బెల్ట్‌షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది. ఇక బార్‌లలో మాదిరిగా బెల్ట్‌షాప్‌లలో ఆహార పదార్థాలు లభ్యమవుతున్నాయి.  – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం

 బెల్ట్‌ షాప్‌లు, లైసెన్స్‌ దుకాణాల వద్ద అనధికారికంగా పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటుకు, ఎంఆర్‌పీకి మించి అమ్మకాలకు నాయకులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. తమవంతు సాయం చేసినందుకు షాప్‌ల యజమానులు, సిండికేట్ల నుంచి ముడుపులు, వాటా తీసుకుంటున్నారు. సిండికేట్‌ ఏర్పాటైనచోట నేతలు అదనపు వాటా పొందగా, అది లేనిచోట లైసెన్స్‌ షాప్‌నకు నెలకు రూ.లక్ష చొప్పున తీసుకుంటున్నారు.

రాజాంలో మొదలై జిల్లా అంతటికి విస్తరణ 
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటే రాజాం నియోజకవర్గంలో లిక్కర్‌ దందా మొదలైంది. లైసెన్స్‌ షాపుల యజమానులందరినీ సిండికేట్‌ చేశారు. ఇందులో సభ్యుడిగా నియోజకవర్గ కీలక నేతను చేర్చారు. లాభాల్లో వాటాను కీలక నేతకు ఇస్తున్నారు. అంతా ఏకం  కావడంతో ఎంఆర్‌పీకి మించి విక్రయాలే కాదు ఎక్కడికక్కడ బెల్ట్‌ షాపులూ నడుపుతున్నారు.

నెలకి షాపునకు రూ.లక్ష  
శ్రీకాకుళం నియోజకవర్గంలోనైతే సిండికేట్‌ లేదు కానీ బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లు, ఎంఆర్‌పీకి మించి విక్రయాలు జరుగుతున్నాయి. చూసీ చూడనట్టున్నందుకు నియోజకవర్గ నేతకు ఒక్కో షాపు నుంచి నెలకు రూ.లక్ష ముట్టజెబుతున్నారు. అధికారులే సూత్రధారులై ఆ ఒప్పందం అమలు చేస్తుండడం గమనార్హం. 

టెక్కలి, ఆమదాలవలసలో సోదరుల పెత్తనం 
టెక్కలి, ఆమదాలవలసల్లో కీలక నేతల సోదరులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలసలో కొన్ని షాపులు సిండికేట్‌లో కలవలేదు. వాటి యజమానులు నెలవారీ ముడుపులిస్తున్నారు. పాతపట్నంలో కూడా వ్యాపారులంతా సిండికేటై, అక్కడున్న నేతకు వాటా ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. బెల్ట్‌ షాపుల్లో క్వార్టర్‌పై రూ.30 అదనంగా పిండుకుంటున్నారు. ఇచ్ఛాపురంలో నెల వారీ మామూళ్లు కొనసాగుతున్నాయి.

నరసన్నపేటలో మొత్తమంతా కీలక నేతకే
నరసన్నపేటలో కీలక నేత పంట పండింది. కలిసి మద్యం వ్యాపారం చేసుకుందామని నమ్మబలికి అనుచరులు, నాయకుల దగ్గరి నుంచి రూ.20 కోట్లకు పైగా సేకరించారు. వారికి వ్యాపారంలో వాటా ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాలకు దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. తీరా తన కుటుంబ సభ్యుల పేరునే ఎక్కువగా దరఖాస్తులు చేశారు. వారి కుటుంబసభ్యులకే లాటరీలో ఎక్కువ దుకాణాలు వచ్చాయి. రూ.20 కోట్లు ఇచి్చన నాయకులు, అనుచరులను దూరంపెట్టారు. వారి డబ్బూ తిరిగివ్వలేదు. వాటాలూ ఇవ్వలేదు. దీంతో ఆగకుండా.. నియోజకవర్గంలో మిగతావారికి దక్కిన షాపులను సైతం బెదిరించి సిండికేట్‌లో కలిపారు. పైసా పెట్టుబడి లేకుండా తానొక వాటా తీసుకుంటున్నారు.

పలాసలో అల్లుడి దందా  
పలాసలో సీనియర్‌ నేత అల్లుడే చక్రం తిప్పుతున్నారు. వ్యాపా­రు­లందరినీ సిండికేట్‌గా చేయడమే కాక  లైసెన్స్‌ షాపుల కౌంటర్లలోనే క్వార్టర్‌ బాటిల్‌పై రూ.20 అదనంగా అమ్మేలా దారి చూపించారు.  ప్రతిఫలంగా సిండికేట్‌లో వాటాతో పాటు షాపుల నుంచి నెల వారీ ముడుపులు తీసుకుంటున్నారు. జిల్లాలో లైసెన్స్‌ షాప్‌ల కౌంటర్లలో ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేపట్టడం పలాసలోనే మొదలవడం గమనార్హం.

మద్యం మత్తులో గ్రామాలు  
ప్రభుత్వం తీసుకొచి్చన విధానంతో పాటు బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చి సిక్కోలు గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. మత్తులో హత్యలు, అత్యాచారాలు, గొడవలు జరుగుతున్నాయి.  జనవరి 19న శ్రీకాకుళం న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను అతి కిరాతకంగా ఓ యువకుడు చంపేశాడు. ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీ కాలనీలో మద్యం మత్తులో సాహుకారి ఢిల్లీశ్వరరావు భార్యను హత్య చేశాడు. మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను భర్త అప్పలరెడ్డి దారుణంగా నరికి చంపాడు.  కాశీబుగ్గలో మద్యం మత్తులో ఇద్దరు బాలికలపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం బలగ వద్ద బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద బీరు సీసాలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement