
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
గార: ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. శనివారం అంపోలు జిల్లా జైలును ఆయన సందర్శించారు. ముద్దాయిల ఆరోగ్య పరిస్థితి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేనివారికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆయనతో పాటు న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, జైలు సిబ్బంది ఉన్నారు.
జనావాసాల్లోకి జింక
ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలోని సూదికొండ, పీర్లకొండ మధ్య ప్రాంతంలో సంచరిస్తున్న జింకల సమూహం నుంచి ఓ జింక దారి తప్పి జనావాసాల్లోకి చొరబడింది. బంగ్లారోడ్డులోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉండిపోయింది. స్థానికులు గుర్తించి కమిషనర్ ఎన్.రమేష్కు సమాచారం అందించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భానుమూర్తికి కమిషనర్ సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి జింకను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో పొదల్లోకి వెళ్లిపోవడంతో అందరూ వెనుదిరిగారు.
ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా బుక్కూరు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ కార్యదర్శిగా బుక్కూరు ఉమమామహేశ్వరరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంలకు కృతజ్ఞతలు తెలిపారు.
సెలవుల్లోనే
బదిలీలు పూర్తిచేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ రమణమూర్తి, జి.రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మే 31 నాటికి అన్ని కేటగిరీల టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని, జూన్ 5 తర్వాత స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. అప్పటికే నూతన ఉపాధ్యాయులు పాఠశాలలో జాయినైతే ఎన్రోల్మెంట్ డ్రైవ్ నూతనోత్సాహంతో చేపట్టడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. పాఠశాల పని దినాల్లో బదిలీలు జరగడం వల్ల ఉపాధ్యాయులు.. విద్యార్థుల మీద దృష్టిపెట్టే విషయంలో కొంత సతమతమవుతారని విషయాన్ని అధికారులు మర్చిపోవద్దన్నారు.
లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు
నందిగాం: మండలంలోని ఆకుల రఘునాథపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం వేకువజామున లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ నుంచి రైలు బోల్టు, నట్లు లోడ్తో వచ్చిన లారీ ఆకుల రఘునాథపురం వద్దకు వచ్చే సరికి బస్ ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అజమ్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లీనర్ ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొనసాగుతున్న
వేసవి శిక్షణ శిబిరాలు
శ్రీకాకుళం అర్బన్/ఎచ్చెర్ల: గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం హిందీ పండిట్ రాజశేఖర్, గణిత ఉపాధ్యాయుడు జగదీష్ చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బలగ హడ్కో కాలనీ గ్రంథాలయంలో లైబ్రేరియన్ పి.ఉగ్రసేన ఆధ్వర్యంలో పిల్లలకు నీతి కథలు చెప్పారు. లావేరు శాఖా గ్రంథాలయంలో రిసోర్స్పర్సన్ పి.పద్మావతి మాట్లాడుతూ అతిగా సెల్ఫోన్ వినియోగిస్తే కలిగే అనర్థాలను వివరించారు.

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం