
మహిళా కార్యాలయానికి రక్షణ కరువు
మెళియాపుట్టి: విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు, వీవోఏలు, డ్వాక్రా మహిళలు అధికంగా వస్తూపోతూ ఉండే మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య వెలుగు కార్యాలయానికి ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి, వెలుగు కార్యాలయాలు గ్రామ శివార్లలో ఉండడం వలన పక్కనే ఉన్న మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుని, సాయంత్రం 7 గంటలు దాటాక కొంతమంది మందుబాబులు కార్యాలయాల వరండాల్లో మద్యం సేవిస్తున్నారు. అనంతరం సీసాలు పగలగొట్టడం వంటి వికృత చేష్టలు చేస్తున్నారు. కనీస ఆలోచన లేకుండా మందుబాబులు చేస్తున్న అసభ్య కార్యకలాపాలు ఉద్యోగులను విస్మయానికి గురి చేస్తున్నాయి. సెలవు రోజుల్లో అయితే కార్యాలయాల వద్ద వాహనాలు నిలిపి అక్కడే తిష్ట వేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు వరండాలపై పగలగొట్టిన మద్యం బాటిళ్లు, అసభ్యమైన చెత్త ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయని ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి కార్యాలయాల పక్కనే ఉన్న మద్యం దుకాణం ఒక కారణమైతే, ప్రహరీ లేకపోవడం మరో కారణమని చెబుతున్నారు. ప్రహరీ నిర్మించాలని ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగులు
పక్కనే మద్యం దుకాణం ఉండడంతో అవస్థలు

మహిళా కార్యాలయానికి రక్షణ కరువు