
జూన్ 4న ’వెన్నుపోటు దినం’
● విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్ పిలుపు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలను మోసం చేసి, ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఆ బాధలను ప్రజల తరఫున వెల్లడించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘వెన్నుపోటు దినం’ నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్లి కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు జూన్ 4న మెమొరాండం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనా లని పిలుపునిచ్చారు. ఇది ప్రజలతో ఉన్న మమకారాన్ని చాటే సమయం, అన్ని వర్గాల సమస్యలకు అండగా నిలవాల్సిన సందర్భమని అన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని కృష్ణదాస్ కోరారు.
వెన్నుపోటు దినం
విజయవంతం చేద్దాం
● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం రూరల్: వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శుక్రవారం ధర్మాన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే ఎక్కడికక్కడే వ్యతిరేకత వస్తోందన్నారు. ముందుగా ఏడురోడ్ల జంక్షన్ నుంచి డేఅండ్నైట్ మీదుగా జన సమూహంతో ర్యాలీగా వెళ్లి కూటమి చేసిన మోసంపై తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వాలన్నారు. పార్టీ అప్పగించిన పదవుల మేరకు వారివారి విభాగాలను కలుపుకుంటూ అందరితో కలిసి సమావేశాలు నిర్వహించాలన్నారు. గార, రూరల్ ప్రాంతంతో పాటు ప్రతి డివిజన్ నుంచి అధిక సంఖ్యలో జనాలు వచ్చేలా పార్టీ నేతలు చూసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనపై వ్యతిరేకంగా ఉన్నవారిని సంప్రదించి వారు కూడా ర్యాలీలో పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

జూన్ 4న ’వెన్నుపోటు దినం’