
ఆదిత్యా నమోస్తుతే..!
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వైశాఖ మాసం నాలుగో ఆదివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేకంగా తులసీదళాలతో ఆదిత్యునికి అలంకరణ చేసి ఉదయం 5.30 గంటల నుంచే సర్వదర్శనాలకు అనుమతించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో దాతలు,ప్రముఖులకు అంతరాలయ దర్శనంతో పాటు సాధారణ భక్తులకు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు అవస్థలు తప్పలేదు. మరుగుదొడ్లు, కేశఖండనశాల వద్ద సిబ్బంది అదనపు వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. ప్రసాదాల కౌంటర్ల వద్ద కూడా భక్తులు అవస్థలు పడ్డారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.6,38,100, విరాళాలు, ప్రత్యేక పూజలల ద్వారా రూ.1,05,828, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.05 లక్షల వరకు ఆదాయం లభించినట్లు ఈవో ప్రకటించారు.