జలుమూరు: సురవరం పంచాయతీ దొంపాక వద్ద వంశధార నది నుంచి ఇసుక అక్రమంగా రాత్రి వేళలో తరలిస్తున్నారు. నిన్నటి వరకూ సైరిగాం పంచాయతీ పరిధి లింగంన్నాయుడుపేట నుంచి తవ్వకాలు జరిపిన నాయకులు తాజాగా దొంపాక గ్రామాన్ని ఎంచుకున్నారు. మండల కూటమి నాయకులతో కలిపి ఈ అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. కొద్ది నెలల కిందట జిల్లా పోలీసు అధికారికి ఫిర్యా దు చేసి ఇసుక లారీలు పట్టించినా వాటిని నామమా త్ర చర్యలతో పోలీసులు విడిచిపెట్టేశారని విమర్శలు వచ్చాయి. అయితే దొంపాక ఇసుక రీచ్ నుంచి ఇసుకను పాత అనుభవం ఉన్నవారే మళ్లీ ఈ అక్రమ రవాణాకు తెర తీశారు. స్థానిక అధికారులకు ఫిర్యా దు చేస్తే సంబంధిత అధికారులే ఈ అక్రమ రవాణాదారులకు సమాచారం ఇచ్చి దాడులు చేసే సమయానికి కొమనాపల్లి వంతెన దాటిస్తున్నారు. పేరుకు దాడులు చేసినట్లుగా కలరింగ్ ఇచ్చి తూతూ మంత్ర చర్యలతో మమ అనిపిస్తున్నారు.
ఈ మార్గంలో రవాణా..
కొమనాపల్లి జంక్షన్, వంశధార వంతెన వద్ద వాహనాలు నిలుపుదలకు అవకాశం ఉండడంతో అదే చో ట ఇసుకను తవ్వేందుకు యంత్రాలు సైతం సిద్ధంగా ఉంచుతున్నారు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత సిద్ధం చేసిన యంత్రాలతో తవ్వకాలు జరిపి వాహనాలలో లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారు. కొమనాపల్లి వంతెన నుంచి సరుబుజ్జిలి వైపు నుంచి ఈ వాహనాలు విశాఖకు తరలిస్తున్నారు.
ఎంపీపీ వాన గోపితో వాగ్వాదం
ఇసుక రాత్రి వేళలో అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఎంపీపీ వాన గోపి, స్థానికులతో కలిసి గురువారం రాత్రి ఇసుక లారీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇసుకాసురులు ప్రతిఘటించి వాగ్వాదానికి దిగారు. అనుమతులు ఉన్నాయని దబాయింపు చేస్తున్నారు. విచిత్రంగా రాత్రి వేళల్లో అనుమతు లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు మాట్లాడుతూ నది నుంచి రాత్రి వేళలో తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.
దొంపాక కేంద్రంగా రాత్రి వేళలో
ఇసుక అక్రమ రవాణా
యంత్రాలతో తవ్వకాలు
చోద్యం చూస్తున్న అధికారులు
చీకటిలో ఇసుక దొంగలు