బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలో వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీసుల పక్షపాత వైఖరి బట్టబయలైంది. వినాయక నిమజ్జనోత్సవంలో బుధవారం రాత్రి అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. డీజేల వినియోగం, నిబంధనలు అమలు, పోలీసుల సమన్వయ లోపంపై స్థానికులు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో డీజేల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించామని ఉత్సవ కమిటీలకు పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. కానీ మండల కేంద్రంలో జరిగిన కొన్ని ఊరేగింపుల్లో మాత్రం డీజేలు, భారీ సౌండ్ సిస్టమ్స్లతో హోరెత్తించారు. మరికొన్ని కమిటీల ఊరేగింపులపై ఆంక్షలు విధించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. అసలు ఏ ప్రాతిపదికన కొందరికి అనుమతులు ఇచ్చారని, నిబంధనలు అందరికీ ఒకేలా ఎందుకు అమలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో కొన్ని రాజకీయ పరమైన పాటలను భారీ శబ్ధాలతో వినిపించడంతో ప్రధాన కూడలి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇతర విగ్రహాల వెంట ఉన్న యువకుల మధ్య ఈ పాటలు కవ్వింపు చర్యలకు దారి తీశాయి. అలాగే స్థానికంగా రెండు కాలనీలకు చెందిన వారు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ తరుణంలో పోలీసులు అక్కడికి చేరుకోగానే పోలీసులు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం ఎన్నడూ లేనంతగా అర్థరాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు


