మడకశిర రూరల్/అమరాపురం: తీవ్ర వర్షాభావం...పాలకుల ముందుచూపులేని తనం రైతులకు శాపంగా మారింది. గత ఏడాది భారీ వర్షాలు కురిసినా కనీసం చెరువులు కూడా నింపకపోవడంతో ఈసారి భూగర్భజలమట్టం భారీగా పడిపోయింది. దీంతో బోర్లన్నీ ఒట్టిపోయాయి. మరోవైపు కళ్లముందే హంద్రీ–నీవా కాలువలో పారుతున్న నీరు కుప్పానికి వెళ్లిపోతోంది. దీంతో ఖరీఫ్ కల్లోలంగా మారింది. పంటలన్నీ కళ్లముందే ఎండిపోతుండగా..దిక్కుతోచని రైతులు కనీసం పశువులకు మేతకై నా పనికొస్తుందని బిడ్డలా కాపాడిన పంటను తొలగిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. గురువారం మడకశిర మండలం సింగేపల్లి వద్ద ఎండిపోతున్న వేరుశనగ పంటను రైతులు ట్రాక్టర్తో తొలగిస్తూ కనిపించారు. అలాగే అమరాపురం మండలం హలుకూరు గ్రామ రైతు గంగాధర నాలుగు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోతుండటంతో పశువులకు గ్రాసమైనా దక్కుతుందని భావించి పంటను తొలగించాడు.


