ధర్మవరం అర్బన్/రొద్దం/పెనుకొండ రూరల్/కనగానపల్లి: గణేష్ నిమజ్జనంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన ధర్మవరం, రొద్దం, పెనుకొండ, కనగానపల్లి మండలాల్లో పర్యటించారు. ఇందులో భాగంగానే పలు వినాయక మండపాలను పరిశీలించారు. నిర్వాహకులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద డీజేలు, లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. మండపాల వద్ద రాజకీయ నాయకుల పాటలు, సమావేశాలు పెట్టి వర్గ విబేధాలు రెచ్చగొడితే చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం రోజు బారికేడ్లు, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాలపై నిరంతర నిఘా ఉండేలా సీసీ కెమెరాలు, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రజలు పోలీసు అధికారులకు సహకరించి వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.
ఎస్పీ సతీష్కుమార్


