ధర్మవరం అర్బన్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థులను, టెట్ పరీక్షల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందికి గురిచేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరివరకుమారి, నాగేంద్రమ్మలు డిమాండ్ చేశారు. పట్టణంలోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద సోమవారం యూటీఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఎన్ఐఏను రద్దు చేసి నీట్ పరీక్షను రాష్ట్రాలు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. నీట్ పరీక్ష రద్దు, విద్యారంగ ప్రక్షాళన, విద్యామంత్రి రాజీనామా చేయాలని కోరుతూ పర్యావరణ, సామాజిక విద్యావేత్త సోనమ్యాంగ్ చుక్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనకు కారణమైన విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) సవరణ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆ పదవికి అనర్హుడన్నారు. టెట్ నుంచి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకులు రామంజినేయులు, పెద్దకోట్ల సురేష్, వెంకట కిషోర్, రాంప్రసాద్, నాగిరెడ్డి, గోపాలరావు, మణిమాల తదితరులు పాల్గొన్నారు.


