బెళుగుప్ప: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ ఐదుగురు మహిళలు శనివారం బెళుగుప్పలో హల్చల్ చేశారు. కిరాణా దుకాణాలు, బేకరీలో తనిఖీలు చేపట్టి ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.1,200 నుంచి రూ.1,500 వరకూ వసూలు చేసి, ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్, కృష్ణానగర్, గుంటూరు చిరునామాతో ఉన్న రసీదులు అందజేశారు. దీంతో అనుమానం వచ్చిన కొందరు వెంటనే విషయాన్ని స్థానిక విలేకరుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విలేకరులు అక్కడకు చేరుకుని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఫొటోలు తీయబోతుండగా ముఖాలను దాచుకుని జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి తమకు తెలుసునని, కావాలంటే మాట్లాడండి అంటూ ఫోన్ కాల్ చేసి చేతికి ఇవ్వబోయారు. అయితే పోలీస్ స్టేషన్లోనే అనుమానాలు నివృత్తి చేసుకుందామంటూ స్థానికులు పేర్కొనగానే ముఖాలు కనిపించకుండా చున్నీలు, కొంగులు అడ్డు పెట్టుకుని ఆటోలో కళ్యాణదుర్గం వైపుగా ఉడాయించారు. ఘటనపై జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి దేవరాజ్ను వివరణ కోరగా.. వారంతా నకిలీలని, దుకాణదారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.


