యల్లనూరు: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆదివారం యల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో పర్యటించనున్నట్లు ‘రణబలి’ చిత్ర యూనిట్ మేనేజర్ సుబ్బు తెలిపారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ దేవరకొండ ‘రణబలి’గా, రష్మిక ‘జయమ్మ’గా కనిపించనున్న విషయం తెలిసిందే. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఆ కాలంలోని సామాజిక పరిస్థితులు, స్వాభిమాన పోరాటాలు, భావోద్వేగ బంధాలను ప్రతిబించించేలా జంగంపల్లి కోట (బ్రిటీష్ పాలనలో నిర్మించిన) లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయ్ దేవరకొండపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
పల్లెల్లో వన భోజనాలు
బత్తలపల్లి: మండలంలోని గుమ్మల్లకుంట, అప్పరాచెరువు, వేల్పుమడుగు, లింగారెడ్డిపల్లి, సంజీవపురం, ఎం.చెర్లోపల్లి, అనంతసాగరం గ్రామాల వాసులు శనివారం వనభోజనాలకు తరలివెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రోజంతా చెట్ల కిందనే గడిపారు. అనంతరం సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన తోరణం కింద నుంచి ఇళ్లకు చేరుకున్నారు.


