తాడిపత్రి రూరల్: ప్రియురాలు మోసం చేసిందన్న బాధలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని అంకంపల్లికి చెందిన నాగమల్లారెడ్డి, పద్మావతి దంపతులకు ఇరువురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివపవన్కుమార్రెడ్డి వాటర్ బాటిళ్లను దుకాణాలకు వేస్తూ వచ్చిన కమీషన్ను కుటుంబ అవసరాలకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల యువతి తనను మోసం చేస్తున్నట్లుగా గుర్తించిన శివపవన్కుమార్రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకుని చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం పులివెందుల నుంచి తాడిపత్రికి బస్సులో వచ్చి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్కు ఆటోలో చేరుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా తమ్ముడు శివనాగార్జునరెడ్డి ఫోన్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న శివపవన్కుమారెడ్డి మాట్లాడుతూ.. తాను ఎక్కడున్నానో తనకే తెలియదని, ఇక ఇంటికి రానని, ప్రేమ విఫలం కావడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తెలిపాడు. ఆందోళనకు గురైన తమ్ముడు వెంటనే సర్ది చెబుతూ ఎక్కడున్నావో లోకేషన్ షేర్ చేయాలని అడగడంతో శివపవన్కుమార్రెడ్డి ఫోన్ లోకేషన్ షేర్ చేశాడు. అప్పటికే కోమలి సమీపంలోకి చేరుకున్న శివపవన్కుమార్రెడ్డి ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ సమాచారంతో ఘటనా స్థలానికి జీఆర్పీ హెచ్సీ వరప్రసాద్ చేరుకుని పరిశీలించారు. కాసేపటి తర్వాత ఫోన్ లోకేషన్ ఆధారంగా ప్రత్యేక వాహనంలో తల్లిదండ్రులతో కలసి శివనాగార్జునరెడ్డి చేరుకున్నాడు. పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న కుమారుడి శరీర భాగాలు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


