తాడిపత్రి రూరల్: ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలు... తాడిపత్రి డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు బుధవారం ఉదయం ఊరుచింతల గ్రామం నుంచి 50 మంది ప్రయాణికులతో తాడిపత్రికి బయలు దేరింది. అవుల తిప్పాయపల్లి సమీపంలో రోడ్డు డైవర్షన్ కారణంగా 544డీ జాతీయ రహదారిపైకి చేరుకున్న బస్సు వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ఉన్నఫళంగా ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తూ దూసుకెళ్లాడు. ఏ కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కిందపడే ప్రమాదముండడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని కుడి వైపుగా మళ్లించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పక్కనే ఉన్న భారీ వాహనాన్ని ఢీకొనే అవకాశం ఉండడంతో వెంటనే ఎడమ వైపుగా మళ్లించడంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న డిపో అధికారుల సూచన మేరకు ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చారు. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించి బస్సును డిపోకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్లు డిపో మేనేజర్ మురళీధర్ తెలిపారు.


