● లేపాక్షిలో పోలీసు స్టేషన్ భవనానికి భూమి పూజ చేసిన ఎస్పీ
లేపాక్షి: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే లేపాక్షిలో ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన పోలీస్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. బుధవారం ఆయన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా పోలీసు భవన నిర్మాణానికి సహకారం అందిస్తున్న బాలాజీతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. లేపాక్షిలో నూతన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ భవనాలు నిర్మించడం వల్ల ఈ ప్రాంత వాసులకు మెరుగైన సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు సంబంధించి పోలీస్ సేవలు అందుబాటులో ఉండే విధంగా, నూతనంగా నిర్మిస్తున్న భవనం పైఅంతస్థులో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. హిందూపురంలోని సర్కిల్ కార్యాలయాన్ని లేపాక్షికి మార్చడం వల్ల ప్రజలకు మరింత వేగంగా సేవలందించడం సాధ్యమవుతుందన్నారు. సీఎస్ఆర్ నిధులు ద్వారా పోలీసు కార్యాలయ నిర్మాణానికి సహకారం అందించిన బాలాజీని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించి పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హిందూపురం డీఎస్పీ మహేష్, హిందూపురం అప్గ్రేడ్ స్టేషన్ సీఐ ఆంజనేయులు, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎస్ఐ నరేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కోనుప్పలపాడులో
బాలుడి కిడ్నాప్
తాడిపత్రిటౌన్: కోనుప్పలపాడులో స్కూలు బస్సు దిగి ఇంటికెళ్తున్న బాలుడిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. బంధువుల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులు. వీరి కుమారుడు వేమచంద్ర యాడికిలోని ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజులాగే బుధవారం పాఠశాల ముగియగానే వేమచంద్రను స్కూల్ బస్సులో తీసుకొచ్చి స్వగ్రామంలో దింపారు. అప్పటికే అక్కడ ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్న వేమచంద్రను కిడ్నాప్ చేసి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కుమారుడు కనిపించలేదు. ఎక్కడికెళ్లాడో అని ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైన వారు.. స్కూలు బస్సు దింపే చోట సమీపంలోని దుకాణంలోని సీసీ కెమెరాను పరిశీలించారు. ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్విచక్రవాహనం కుందనకోట వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి తండ్రి గోవిందుకు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా.. ఎవరిౖపైనెనా అనుమానం ఉందా... అని ఆరా తీసిన పోలీసులు.. బంధువైన వినోద్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. వినోద్ తన స్నేహితుని ద్వారా బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు తెలుసుకున్నారు. అయినా అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో ఏఎస్పీ రోహిత్కుమార్తో పాటు నియోజక వర్గంలోని పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కుందనకోటలో కిడ్నాప్నకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించినట్లు తెలిసింది.


