చిలమత్తూరు: సైబీరియన్ పక్షులకు కష్టం కలగనివ్వకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సైబీరియన్ పక్షుల విడిది కేంద్రాలైన వీరాపురం, వెంకటాపురం గ్రామాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బుధవారం ఆయన వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వాచ్ టవర్ ఎక్కి బైనాక్యులర్ ద్వారా పక్షులను వీక్షించారు. కెమెరాతో స్వయంగా పక్షుల ఫొటోలు తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... సైబీరియన్ పక్షులకు అవసరమైన ఆహారం, నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెట్ల పైనుంచి పడే సైబీరియన్ పక్షుల పిల్లలను కాపాడేందుకు ఓ సంరక్షుడిని నియమించామన్నారు. పక్షి పిల్లలకు మెరుగైన చికిత్స, ఆహారం అందించేందుకు నిపుణులైన అనిమల్ ప్రొటెక్షన్ ఎన్జీఓలతో సమన్వయం చేసుకుంటున్నట్టు వెల్లడించారు. వీరాపురం, వెంకటాపురం, చిలమత్తూరు గ్రామాల సప్లై చానళ్ల పూడిక తీత పనులు చేపట్టి భవిష్యత్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పుట్టపర్తి, లేపాక్షి సందర్శించే పర్యాటకులు వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లోని సైబీరియన్ పక్షులను చూసేందుకు వీలుగా రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ సమత, మత్స్యశాఖ ఏడీ చంద్రశేఖర్, తహసీల్దార్ మనోజ్కుమార్, సర్పంచ్ లక్ష్మీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పక్షుల విడిది కేంద్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
కలెక్టర్ శ్యాంప్రసాద్ వెల్లడి


