● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పుట్టపర్తి అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన ఆర్డీఓ సువర్ణతో కలిసి నల్లమాడ రెవెన్యూ కార్యాలయాన్ని, వేళ్లమద్ది, ఎర్రవంకపల్లి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ... మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల కోసం అందిన అర్జీలు, పెండింగ్లో ఉన్న రెవెన్యూ అర్జీలు, మీ–సేవ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, బయోమెట్రిక్ హాజరు తనిఖీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తహసీల్దార్ మనోజ్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్.. రీసర్వే పూర్తయిన వేళ్లమద్దిలో డ్రాప్ట్ పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్పీఎం భూమలును విభజించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు.


