సిద్ధేశ్వరా.. కరుణుజూపరా
అమరాపురం: నీలకంఠుడు మానవాకారునిగా వెలసిన హేమావతి గ్రామం సిద్ధేశ్వరుని నామస్మరణతో పులకించింది. సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం సిడిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం అమెరికాలో స్థిరపడిన హేమావతి గ్రామ వాస్తవ్యుడు తెచ్చిన వెండి ఆభరణాలను స్వామి వారికి అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు సమీపంలోని కర్ణాటక నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
సిడిమానోత్సవం
సిడిమానోత్సవంలో భాగంగా సాయంకాలం 5.30 గంటలకు సిద్ధేశ్వరస్వామి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూల పల్లకిలో ఉంచి మేళా తాళాలతో ఆలయం నుంచి ముందుభాగంలో కుడివైపున ఉన్న కట్టవద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ నరసింహరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ ఆధ్వర్యంలో అర్చకులు సిడిమానుకు పూజలు చేశారు. అనంతరం సిడిమాను ఉత్సవాన్ని నిర్వహించారు. సిడిమాను ఎక్కే భక్తులు ముఖానికి గంధం రాసుకుని పూలదండ మెడలో వేసుకుని స్వామివారిని దర్శించుకుని సిడిమాను ఎక్కుతారు. వారిని తిప్పేందుకు భక్తులు పోటీ పడ్డారు. సిద్ధేశ్వరా కరుణజూపరా అంటూ ఆ మహాదేవుడిని వేడుకున్నారు. ఇలా సిడిమాను తిప్పడం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, వివాహ, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా భక్తులు తమ మొక్కులు సిడిమాను ఆడడం ద్వారా తీర్చుకుంటారు.
ఘనంగా సిద్ధేశ్వరస్వామి
సిడిమానోత్సవం
వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం
సిద్ధేశ్వరా.. కరుణుజూపరా


