ఓం నమో వేంకటేశాయ
హిందూపురం: పట్టణంలో ఆదివారం పేట వేంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష జనవాహిని చేసిన ‘నమో వేంకటేశ’ నామస్మరణతో ‘పురం’ పులకించింది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం పేట వేంకట రమణ స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం బంగారు కవచాలు, పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
గోవిందా.. గోవింద
మధ్యాహ్నం 3 గంటలకు రథం వద్ద వేదపండితులు హోమం నిర్వ హించి శాంతిపూజలు జరిపారు. ఆలయం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత వేంకటరమణస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. రథానికి సంబంధించిన కొత్త దుంగలను యువకులు మోసుకుని ప్రాకారోత్సవం చేపట్టారు. ఉత్సవమూర్తులను రథం వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్లను భక్తజనం కరతాళల ధ్వనులతో స్వాగతించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా రథంపైకి అరటిపండ్లు, పూలు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో మెయిన్రోడ్డు ప్రాంతం మార్మోగింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రథోత్సవం సందర్భంగా సీఐలు రాజగోపాల్ నాయుడు, జనార్దన్, అబ్దుల్కరీం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, మాజీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్నిశ్చల్, ఆలయ కమిటీ చైర్మన్ భగీరథ నవీన్, లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రమనంద్, ఈఓ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కనుల పండువగా పేట వేంకటరమణస్వామి బ్రహ్మ రథోత్సవం
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వేంకటేశాయ


