అంబటి అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే
పెనుకొండ రూరల్: సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి, అరెస్టులు జరిగాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం పెనుకొండ నగర పంచాయతీలో ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల లడ్డూ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ క్లీన్చిట్ ఇవ్వడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఎక్కడ వైఎస్సార్ సీపీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే విధ్వంసానికి తెరలేపారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడా చంద్రబాబును దూషించలేదన్నారు. మొదట టీడీపీ నాయకులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, అంతటితో ఆగక అంబటి ఇంటి వద్ద విధ్వంసం సృష్టించారన్నారు. ఆయనను హత్య చేసేందుకు ప్రణాళిక ప్రకారమే దాడులు జరిగాయన్నారు. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పినప్పటికీ పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారని, అయినా ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలేదన్నారు. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అనేకసార్లు అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు ప్రెస్మీట్ పెట్టి చెప్పినా ఇప్పటికీ అతడిని అరెస్టు చేయలేదన్నారు. అదే పార్టీ నాయకుడు రాయల్ కిరణ్పై కూడా ఎలాంటి చర్యలూ లేవన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, కిష్ణారెడ్డి, నాయకులు నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి, మల్లిరెడ్డి, నారాయణ యాధవ్, భూమా నాగిరెడ్డి, చెన్నకేశవులు, బొగ్గు నరసింహులు, నారాయణ స్వామి, పిట్టా బాబు, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు
ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలు చేసినా చర్యల్లేవు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ మండిపాటు


