రైతు సేవలకు మంగళం
పుట్టపర్తి అర్బన్: వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేశారు. కేవలం రైతుల కోసమే ఊరూరా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశారు. అందులో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందివ్వడంతో పాటు సాగులో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలాగే ఈ– క్రాప్ బుకింగ్, పంట కోత ప్రయోగాలు, మట్టి నమూనాల సేకరణ, డ్రిప్పు, స్ప్రింక్లర్లకు రిజిస్ట్రేషన్ చేయడం, సీజనల్గా టార్పాలిన్ పట్టలు రైతులకు అందజేయడం వంటి ఎన్నో కీలకమైన పనులు చేసేవారు. దీంతో రైతులు హాయిగా పంటలు సాగుచేసుకునే వారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే రైతు పరిస్థితి తారుమారైంది. పొలంలో ఉండాల్సిన రైతన్న విత్తనాలు, ఎరువుల కోసం పట్టణాల్లో పడరాని పాట్లు పడుతున్నారు.
సిబ్బందిని తగ్గించి... పనులు పెంచి..
జిల్లా వ్యాప్తంగా 68 మంది ఆర్ఎస్కే సిబ్బందిని తగ్గించారు. ఉన్నవారిని కూడా రైతు సేవలకు వినియోగించకుండా ఇతర పనులు చేయిస్తూ మరింత ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్కే సిబ్బందితో విత్తనాలు, ఎరువులు పంపిణీతో పాటు ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ, సచివాలయ సేవల్లో భాగంగా పలు సర్వేలు చేయిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో వలంటీర్లు చేసిన సర్వేలన్నీ ఇప్పుడు ఆర్ఎస్కే సిబ్బందికి అప్పగించారు. దీంతో సగం రోజు ఆర్ఎస్కేల్లో... సగం రోజు గ్రామంలో ఉంటూ సర్వేలు చేయాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
8 వేల ఎకరాలకు ఒకరే సిబ్బంది..
పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీలో 8 వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో ఏటా రెండు విడతల్లో ఖరీఫ్, రబీలో పంటలు సాగు చేస్తారు. గతంలో ఇక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉండేవారు. ప్రస్తుతం విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ను మరో ఆర్ఎస్కేకు మార్చారు. దీంతో అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ విభాగాల పనులన్నీ ఒక్కరే చూడాల్సి వస్తోంది. 8 వేల ఎకరాలను రెండు సార్లు ఈ–క్రాప్ బుకింగ్ చేయడంతో పాటు పంట కోత ప్రయోగాలు, ఆర్ఎస్కే పనులు చేయాలంటే తలకుమించిన భారంగా మారిందని ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ
స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... రైతు సంక్షేమమే ధ్యేయంగా ఊరూరా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల ముుంగిళ్లలోనే విత్తనాలు, ఎరువులు అందజేశారు. సంక్షేమ పథకాలతో పాటు రైతుకు కావాల్సిన సకలం ఆర్బీకేల ద్వారా
అందించారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరాక రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం విత్తనాలు కూడా సకాలంలో అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
68 ఆర్ఎస్కేల మూత..
చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గతంలో అందిన సంక్షేమ పథకాలన్నింటికీ మంగళం పాడింది. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చిన ప్రభుత్వం... రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని తగ్గించి వాటిని నిర్వీర్యం చేసింది. ఇక ఆర్ఎస్కేల్లో పని చేసే సిబ్బందిని సైతం కుదించి ఆర్ఎస్కేలను మూసేసే దిశగా అడుగులు వేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో 416 రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. రేషనలైజేషన్ పేరుతో రెండు, మూడు ఆర్ఎస్కేలను కలిపి ఒకటిగా సర్దుబాటు చేశారు. దీంతో ఆర్ఎస్కే కేంద్రాల సంఖ్య 348కి చేరింది. అంటే 68 ఆర్ఎస్కేలను పూర్తిగా మూసేశారు. అలాగే గతంలో ఆర్బీకేలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్లు ఉండేవారు. ఇప్పుడు ఆర్ఎస్కేల్లో కేవలం ఒక్కరే ఉంటున్నారు. దీంతో సిబ్బందిపై పనిభారం పెరిగింది. దీంతో మరికొంత మంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు.
రైతు సంక్షేమాన్ని విస్మరించిన
చంద్రబాబు సర్కార్
జిల్లాలో 68 రైతు సేవా కేంద్రాల మూత
రేషనలైజేషన్ పేరుతో
సిబ్బంది సర్దుబాటు
గతంలో ముగ్గురు చేసే పని
ప్రస్తుతం ఒకరితో చేయిస్తున్న వైనం
పనిభారంతో ఉద్యోగాలు వదిలేస్తున్న ఆర్ఎస్కే సిబ్బంది
విత్తనాలు, ఎరువులకూ
ఇబ్బందులు పడుతున్న రైతులు
రైతు సేవలకు మంగళం


