జీతాలు చెల్లించండి సార్
పుట్టపర్తి అర్బన్: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తాము నాలుగు నెలలు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే జీతాలు చెల్లించాలంటూ డ్వామా ఇన్చార్జ్ పీడీ విజయప్రసాద్ను టెక్నికల్ అసిస్టెంట్లు, బీఎఫ్టీలు కోరారు. ఈ మేరకు గురువారం పీడీని కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. నాలుగు నెలల కాలంలో ఎన్నో పండుగలు, శుభకార్యాలు జరిగాయని, జీతాలు అందక పోవడంతో వాటన్నింటికీ తాము దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం గడవడమే కష్టంగా మారిందన్నారు. నిత్యావసరుకులు, పిల్లల చదువులకు ఫీజులు, ఇంటి అద్దెలు, బ్యాంకు కంతులు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. 23 శాతం పీఆర్సీ, గ్రేడ్ ఫిక్సేషన్, గ్రాట్యూటీ అమలు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఎఫ్టీఈలుగా మార్చడం, ప్రమోషన్లు, హెల్త్ కార్డుల మంజూరు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీడీ మాట్లాడుతూ.. సమస్యను సీఆర్డీ కార్యాలయానికి పంపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలక్ష్మి, డ్వామా జేఏసీ అధ్యక్షుడు మనోహర్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయినాథరెడ్డి, యూనియన్ నాయకులు, టీఏలు, బీఎఫ్టీలు పాల్గొన్నారు.
ఉపాధి టీఏ, బీఎఫ్టీల డిమాండ్


