విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పాలి
పుట్టపర్తి అర్బన్: ‘‘విద్య మాత్రమే విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించలేదు. క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. అందువల్ల చిన్నారులకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పాలి’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ‘సమగ్ర శిక్ష’ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంఈఓలు, ఉపాధ్యాయులు, లైన్ విభాగాల అధికారులకు ‘ఐఈ’ కార్యకలాపాలపై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో సమగ్ర విద్య బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు హాజరు, క్రమశిక్షణలో పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. ముఖ్యంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని, డ్యూటీ సమయంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా ఒకవేళ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పాఠశాలలకు వెళ్లి విద్యాబోధన చేయాలన్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులను బయటకు పంపకూడదన్నారు. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలోనూ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులను మందలించారు.
దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్ల పంపిణీ..
జిల్లాలోని ముగ్గురు దివ్యాంగ విద్యార్థులకు రూ. 50 వేల విలువైన ఎలక్ట్రికల్ ట్రైౖ సైకిళ్లను కలెక్టర్ అందజేశారు. హిందూపురానికి చెందిన అశ్విన్ (డిగ్రీ రెండో సంవత్సరం), కొడతిమ్మయ్యగారిపల్లికి చెందిన బిందుశ్రీ (5వ తరగతి), శెట్టిపల్లికి చెందిన షేక్ అబ్దుల్ (ఇంటర్)లకు ఒక్కో ట్రై సైకిల్ అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, సమగ్ర శిక్ష జిల్లా అధికారి దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దశలోనే దేశభక్తి,
సేవాగుణం పెంపొందించాలి
సాక్షి, పుట్టపర్తి: విద్యార్థి దశలోనే దేశభక్తి, సామాజిక సేవా గుణం, క్రమశిక్షణ విలువలను పిల్లల్లో పెంపొందించాలని కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ సూచించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ స్కౌట్స్ – గైడ్స్ విద్యార్థులు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్ను కలిసి, స్టిక్కర్లను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అధికారులు అభినందించారు. ప్రతి పాఠశాలలోనూ స్కౌట్స్– గైడ్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా స్కౌట్స్ సమన్వయ అధికారి సి.నాగరాజు, జగరాజుపల్లి పాఠశాల గైడ్ కెప్టెన్ సీవీ శారద, స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి
కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడం, అంధత్వాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా నాణ్యమైన సేవలను అందించాలని కొత్తచెరువు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, డీసీహెచ్ఎస్డాక్టర్ మధుసూదన్తో కలసి కొత్తచెరువు సీహెచ్సీలో శంకర్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. శంకర కంటి ఆస్పత్రి సేవలను అభినందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ అనూరాధ, డాక్టర్ అశ్వత్ కుమార్, డీఐఓ డాక్టర్ సురేష్ బాబు, శంకర్ నేత్రాలయ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు కలెక్టర్
శ్యాంప్రసాద్ సూచన
రాజకీయాలకు దూరంగా
ఉండాలని హెచ్చరిక
విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పాలి


