
అన్యాయంపై ఎక్కడికక్కడ నిలదీద్దాం
పుట్టపర్తి అర్బన్: బంజారాలకు అన్యాయం జరిగితే ఎక్కడికక్కడ నిలదీయాలని అఖిల భారత బంజారా సేవా సంఘం (ఏబీబీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు బాబురావ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అణగారిన వర్గాలపై అత్యాచారాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆదివారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహీ శ్రీనివాస కళ్యాణ మంటపంలో బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది బంజారాలు విచ్చేశారు. తొలుత సేవాలాల్ మహరాజ్, అంబేడ్కర్, బిర్సా ముండా చిత్రపటాలతో పాటు ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’లో వీర మరణం పొందిన మురళీనాయక్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులుల అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన బాబురావ్ చౌహాన్, కర్ణాటక సామాజికవేత్త మహారాజ్, హైదరాబాద్ సునీత శంకర్లాల్ నాయక్, యర్రా భాస్కర్, ఏబీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు నాయక్, పధాన కార్యదర్శి డుంగావత్ రమేష్ నాయక్ మాట్లాడారు. బంజారాలకు అఖిల భారత బంజారా సేవా సంఘం అండగా ఉంటుందన్నారు. ఇటీవల నల్లమాడలో నాలుగు గ్రామాల గిరిజనుల వెయ్యి ఎకరాల భూముల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి వారికి తిరిగి ఇచ్చే విధంగా సంఘం తరఫున పోరాడి సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. బంజారాలకు ఎవరైనా అన్యాయం చేస్తే వదిలిపెట్టేదిలేదన్నారు. బంజారాల్లో చాలామంది మద్యం, జూదానికి బానిసలయ్యారని, వాటిని వదలకపోతే జాతి క్షమించదని అన్నారు. విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. బంజారాలు ఐక్యంగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. గుత్తి సేవాఘడ్లో వచ్చే కార్తీక దీపోత్సవంలో లక్షదీపార్చన వైభవంగా చేపట్టాలన్నారు. జిల్లాలో అన్ని చోట్లా అంబేడ్కర్, సేవాలాల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఇతర కులాలను ఎస్టీల్లో చేరిస్తే ఒప్పుకోం
ఎస్టీల్లోకి ఇతర కులాలను కలపడానికి వీలులేదన్నారు. ఇటీవల బీసీలను ఎస్టీల్లోకి కలిపేస్తామని మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రకటించారని, అదే జరిగితే ఆయా నియోజకవర్గాల్లో 25 వేలమంది ఎస్టీలు ఏకతాటిపైకొచ్చి వారిని తిరగనీయకుండా అడ్డుకుంటారని బంజారా నేతలు స్పష్టం చేశారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, సేవాఘడ్కు ఏటా రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయాలని, బంజారా భాష, సంస్కృతిని కాపాడాలని, అన్ని బంజారా సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావాలని, సంత్ సేవాలాల్ మహరాజ్ ట్రస్ట్ను ప్రక్షాళన చేయాలని, ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను వెంటనే పునరుద్ధరించాలని సభలో తీర్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, ఎస్సీ, ఎస్టీ మెంబర్ శ్రీనివాసనాయక్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయక్, శివకుమార్ నాయక్, కేవీపీఎస్ అధ్యక్షుడు మల్లికార్జున నాయక్, కుల్లాయినాయక్, ఎకై ్సజ్ సీఐ మల్లికా, సేవ్యానాయక్, తిరుపాల్ నాయక్, వ్యాఖ్యాత శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు.
అణగారిన వర్గాలపై దాడులను పట్టించుకోని కూటమి సర్కార్
బంజారాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదగాలి
అఖిల భారత బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బాబురావ్ చౌహాన్