
సెటిల్మెంట్ల స్టేషన్ !
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సాధారణంగా పోలీసులంటే అరెస్టు చేయడం, లాకప్లో వేయడం చూస్తుంటాం. కానీ పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయం ఆస్తుల పంపకాలు, అగ్రిమెంట్లు రాసుకోవడానికి కూడా వేదికగా మారినట్లు తెలిసింది. చాలాచోట్ల సివిల్ తగాదాల్లో తాము తలదూర్చబోమని పోలీసులు చెబుతుంటారు. కానీ ఇక్కడి ఖాకీలు మాత్రం ‘మేం సివిల్ పంచాయితీలే చేస్తా’మంటూ ముందుకెళుతున్నట్లు సమాచారం. అది కూడా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే అన్నీ జరుగుతున్నాయంటే స్టేషన్లో జరిగే అక్రమాల తంతును అంచనా వేయొచ్చు.
ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసులో పుట్టపర్తి పోలీసుల అవినీతి అక్రమాలు తవ్వేకొద్దీ బయటికొస్తున్నాయి. ఏదైనా కేసులో నిందితుడు పోలీసులకు దొరికాడంటే అరెస్టు చేయడం, ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు పంపడం పరిపాటి. కానీ ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ రాజును పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకుని వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ఆధీనంలో ఉండగానే బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగాయి. సత్యనారాయణ రాజు పేరుపై ఉన్న ఆస్తులకు ఏకంగా అనామతు అగ్రిమెంట్లు కూడా చేశారు. అంటే సత్యనారాయణ రాజుకు పూర్తిగా డబ్బు ముట్టిందని, దీనిపై సర్వహక్కులు తనకే అనేలా నాన్జ్యుడీషియరీ స్టాంపు పేపర్లపై అగ్రిమెంట్లు జరిగాయి. ఎవరికి రాయించారో (కొనుగోలు చేసిన వారి వివరాలు) పేర్లు వెల్లడించలేదు. ఈ క్రమంలో పుట్టపర్తి పోలీసులపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇవన్నీ డివిజనల్ స్థాయి పోలీస్ అధికారి సమక్షంలోనే జరిగినట్టు తెలుస్తోంది.
ప్రవాస భారతీయుడైన మహేంద్రకర్ ఆర్విన్ను రూ.12 కోట్లకుపైగా మోసం చేసిన సత్యనారాయణ రాజుపై మే 22వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదైతే మే 28వ తేదీ అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. అంటే వారం రోజుల పాటు అతణ్ని స్టేషన్లోనే ఉంచి చిత్ర హింసలు పెట్టడంతో పాటు ఆస్తుల బదలాయింపు, ఆస్తులపై సేల్ అగ్రిమెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా చిన్న కేసులో నిందితుణ్ని పట్టుకుంటేనే మీడియా ముందు హాజరుపెట్టి అద్భుతం చేశామని చెప్పుకునే పోలీసులు.. మే 28న డీఎస్పీ విజయకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించే సమయంలో నిందితుడిని చూపకపోవడం గమనార్హం. ఇటీవల ‘తెనాలి’లో జరిగిన తరహాలోనే ఇక్కడ కూడా నిందితుడికి చిత్రహింసలు పెట్టడంతో మీడియాకు చూపలేదని కొంతమంది పోలీసులే ‘సాక్షి’తో తెలిపారు. తర్వాత ఒకరిద్దరు మీడియా ప్రతినిధులకు నిందితుణ్ని ముసుగేసి చూపించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీకి చెందిన అన్నదమ్ములు కీలక పాత్ర పోషించడమే కాదు, పోలీసులకు రూ.50 లక్షల నగదు ముట్టజెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఖాకీలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అన్న చర్చ జరుగుతోంది.
‘ప్రవాస భారతీయుడికి మోసం’ కేసులో వెలుగులోకి కొత్త అంశాలు
పోలీస్ స్టేషన్లోనే ఆస్తుల అగ్రిమెంట్లు
నిందితునికి చిత్రహింసలు పెట్టి
పేపర్లపై సంతకాలు
ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే
అన్యాయపు తంతు
మీడియా ముందుకూ తేలేదు..
వారం రోజులు చిత్రహింసలు..