
రిక్వెస్ట్ కాస్త కంపల్సరీ అయింది
● తాడిపత్రిలోని ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న బయాలజీ సైన్స్ టీచరు మరో 8 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. నాలుగేళ్లుగా ఆమె ఈ స్కూల్లోనే పనిచేస్తున్నారు. ఆమె సబ్జెక్టుకు సంబంధించి అనంతపురంలో ఖాళీలు ఉండడంతో రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో అనంతపురం స్కూళ్లు మాత్రమే ఆప్షన్ ఇచ్చి తర్వాత తాను పని చేస్తున్న స్కూల్ కనబరిచి సబ్మిట్ చేయబోతే సిస్టం అంగీకరించలేదు. తప్పనిసరి బదిలీల టీచర్లు లాగానే జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్ ఇచ్చుకోవాలంటూ సూచన కనిపించింది.
● కంబదూరు మండలం తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న సోషల్ టీచరు, బొమ్మనహాల్ మండలం డి.హొన్నూరు జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్న హిందీ టీచరు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా తప్పనిసరి బదిలీ కింద ఉన్నారని... జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న ఖాళీలన్నింటికీ దరఖాస్తు చేసుకోవాలంటూ చూపించింది. వీరే కాదు పదుల సంఖ్యల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఈ సమస్య ఎదురైంది.
రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కొందరు టీచర్లు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా టెక్నికల్ సమస్య కారణంగా కంపల్సరీ బదిలీగానే చూపిస్తోంది. బాధితులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. సమస్య పరిష్కారమవుతుంది.
– ఎం.ప్రసాద్బాబు డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీలకు సంబంధించి అందుబాటులోకి తీసుకువచ్చిన సాప్ట్వేర్ ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తోంది. ఒకే స్కూల్లో 8 ఏళ్లు సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. కనీసం రెండేళ్లు సర్వీస్ పూర్తయిన వారు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు వారు పని చేసిన స్కూల్ కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఖాళీలన్నీ ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్ ఇచ్చుకోవాలి. రిక్వెస్ట్ బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే వారు.. వారు పని చేస్తున్న స్కూల్ కంటే కూడా ఇంకాస్త సౌకర్యంగా ఉన్న స్కూళ్లు మాత్రమే ఆప్షన్ ఇచ్చి...చివరగా తాను పని చేస్తున్న స్కూల్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఆప్షన్లు ఇచ్చుకున్న స్కూళ్లు రాకపోతే... చివరకు పని చేస్తున్న స్కూల్నే నిర్ధారిస్తారు. అయితే రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా తప్పనిసరి బదిలీ కింద చూపుతుండడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. సాఫ్ట్వేర్ రూపకల్పనలో లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పలువురు నగరంలోని శారదా స్కూల్కు పరుగులు తీసి డీఈఓ ప్రసాద్బాబు వద్ద తమగోడు వెల్లబోసుకున్నారు.
సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఆప్షన్లు..
స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా వెబ్ఆప్షన్లు ఇచ్చుకునేందుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసింది. అప్పటికి వీరి సమస్య పరిష్కారం కాలేదు. తప్పనిసరి బదిలీ టీచర్లు లాగా ఎక్కడిపడితే అక్కడికి బదిలీ అవుతామనే ఆందోళన రిక్వెస్ట్ బదిలీ ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న బదిలీల సాఫ్ట్వేర్
రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే
‘కంపల్సరీ’గా చూపిస్తున్న వైనం
సాయంత్రం 5 గంటలకు గడువు
ముగియడంతో టీచర్లలో గుబులు