అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్‌

Jun 7 2025 1:12 AM | Updated on Jun 7 2025 1:16 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎస్జీటీ కేడర్‌ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్లకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ అర్ధరాత్రి దాకా కొనసాగింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని 686 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌ సాగింది. మున్సిపల్‌ పాఠశాలల్లో 304 పోస్టులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 52 పోస్టులు, ప్రభుత్వ పాఠశాలల్లో 26, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 304 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ స్కూళ్లలో పోస్టులకు 1:2, ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పోస్టులకు 1:3 రేషియో ప్రకారం టీచర్లను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ పదోన్నతులకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సౌకర్యవంతమైన ఖాళీలు లేకపోవడంతో చాలామంది పదోన్నతులు తీసుకోలేదు. మునిసిపల్‌, కార్పొరేషన్‌ టీచర్లకు కేఎస్‌ఆర్‌ స్కూల్‌లో, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్‌ కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. కౌన్సెలింగ్‌ హాజరైన టీచర్లతో ఆప్షన్‌ తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వారందరికీ శనివారం పదోన్నతుల ఉత్తర్వులు జనరేట్‌ కానున్నాయి. వీరితో పాటు బదిలీ అయిన స్కూల్‌ అసిస్టెంట్లు, పీఎస్‌హెచ్‌ఎంలు (స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ టీచర్లు) అందరూ శుక్రవారం వారి పాత స్కూళ్లలో రిలీవై.. శనివారం ఉదయం కొత్త స్కూళ్లల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఉత్తర్వులు జనరేట్‌ అయ్యాయి. ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే వివరాలను రాత్రి 12 గంటలు దాటినా విద్యాశాఖ అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. కాగా, కార్పొరేషన్‌ పరిధిలోని స్కూళ్లకు స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో అధికారులు రోస్టర్‌ పాటించడం లేదంటూ రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు వాదనకు దిగారు. కేఎస్‌ఆర్‌ బాలికల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఆర్జేడీ... ఈ విషయంపై జేడీ సర్వీసెస్‌తో ఫోన్‌లో మాట్లాడి స్పష్టత ఇచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.

నిబంధనలకు పాతర

అనువైన స్థానాల కోసం కొందరు టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బదిలీల చట్టం జీఏ 22 ప్రకారం మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అన్‌మ్యారెడ్‌ ఉమెన్‌’ (అవివాహిత) కేటగిరీ కింద 5 స్పెషల్‌ పాయింట్లు పొందేందుకు అర్హులు. ఈలెక్కన 1985 మే 31కి ముందు జన్మించి ఉండాలి. అయితే 1987 నుంచి 1999 మధ్య జన్మించిన వారు దాదాపు 30 మంది మహిళా టీచర్లు ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద పాయింట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బ్రహ్మసముద్రం, రొళ్ల, డి.హీరేహాల్‌, గుమ్మఘట్ట, మడకశిర, రాయదుర్గం, అమడగూరు, కంబదూరు, అగళి, గుడిబండ, కుందుర్పి మండలాల్లో పని చేస్తున్న మహిళా టీచర్లు ఎక్కువగా అక్రమంగా పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక సీనియార్టీ జాబితాను పరిశీలించిన పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనర్హుల జాబితాను సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ చేస్తున్నారు.

అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్‌1
1/1

అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement