
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
● బాలికపై అత్యాచార ఘటన కలచి వేసింది
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
పెనుకొండ రూరల్: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటన తనను కలిసి వేసిందన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులతో మహిళలు బయట తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. రాత్రి వేళల్లోనే కాదు పగలు కూడా బాలికలు, మహిళలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగుర్రాలపల్లికి చెందిన దళిత బాలికపై జరిగిన కీచకపర్వం క్షమించరానిదన్నారు. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి తక్షణం రక్షణ కల్పించాలని ఉషశ్రీచరణ్ కోరారు. పోలీసులు కూడా ఈ ఘటనపై నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.
బక్రీద్ను ఆనందంగా జరుపుకోండి
● ఎస్పీ రత్న పిలుపు
పుట్టపర్తి టౌన్: బక్రీద్ పండుగను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. జిల్లాలోని ముస్లింలందరికీ ఆమె బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గోవధ చేయరాదని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సజావుగా
పోలీసుల బదిలీలు
● 60 మందికి పోస్టింగ్
పుట్టపర్తి టౌన్: ఒకే స్టేషన్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసకున్న ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్తూ ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు బదిలీల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ హాలులో ఎస్పీ రత్న ఆధ్వర్యంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. 12 మంది ఏఎస్ఐలు, 18 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చారు. ఐదేళ్ల పూర్తి చేసుకున్న వారి జాబితా సిద్ధం చేసి సీనియార్టీ ప్రకారం ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ రత్న తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ సుజాత, సూపరింటెండెంట్ మల్లికార్జున, స్పెషల్బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 11 తేదీ వరకు 0.2 మి.మీ నుంచి 12.9 మి.మీ మేర వర్షసూచన ఉందన్నారు. అందులో ఈనెల 10న 12.9 మి.మీ సగటు నమోదు కావొచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37.5 డిగ్రీలు, కనిష్టం 24.6 డిగ్రీల నుంచి 26.2 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 12 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలులు వీస్తాయని వెల్లడించారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు