
‘సాయి మిషన్’లో మహిళలదే కీలక పాత్ర
ప్రశాంతి నిలయం: అమ్మలా ప్రేమ పంచి ఆధ్యాత్మిక, సేవా పరిమళాలు వెదజల్లిన సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తూ సత్యసాయి మిషన్ను ముందుకు నడపడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ అనన్యా బంధోపాధ్యాయ పిలుపునిచ్చారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభమైంది. ‘శ్రీ సత్యసాయి మహిళా విభాగ్–ది విజనరీస్ ఆఫ్ ది సాయి మిషన్’ అన్న థీమ్తో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సుకు 18 దేశాలకు చెందిన వేలాది మంది మహిళలు, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజల అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు సతీమణి హిమవాహిని, సత్యసాయి బాలవికాస్ జాతీయ కోఆర్డినేటర్ కమలా పాండ్య, సత్యసాయి సేవా సంస్థల జాతీయ కోఆర్డినేటర్ శశిబాలతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కాన్ఫరెన్స్ ప్రారంభించారు.
మహిళలపై సత్యసాయికి అపార నమ్మకం..
అనంతరం కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్ అనన్యా బంధోపాధ్యాయ మాట్లాడుతూ, సత్యసాయికి మహిళలపై అపార నమ్మకం ఉందన్నారు. అందువల్లే ఆయన తన మిషన్ రూపకల్పనలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారని, తద్వారా మహిళల పట్ల ఉన్న నమ్మకం, వారి అభ్యున్నతి పట్ల ఆయనుకున్న చిత్తశుద్ధిని చాటారన్నారు. మనవాళి శ్రేయస్సు కోసం ప్రారంభించిన మిషన్లో మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన మిషన్ను ముందుకు నడపడం భక్తులుగా మన బాధ్యత అన్నారు. అనంతరం హిమాచల్ప్రదేశ్కు చెందిన అడిషనల్ డీజీపీ సత్వాంత్ అత్వాల్ ప్రసంగించారు. సత్యసాయి సేవా సంస్థలలో మహిళలు చురుకై న పాత్ర పోషించాలన్నారు. సత్యసాయి మహిళా లోకానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. అనంతరం దేశ, విదేశాలకు చెందిన మహిళలు ప్రసంగించారు. తొలిరోజు కార్యక్రమం చివర్లో సత్యసాయి సేవా సంస్థలలో ప్రముఖ పాత్ర పోషంచిన మహిళలను ఘనంగా సన్మానించారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.
కోల్కతా హైకోర్టు జడ్జి జస్టిస్
అనన్యా బంధోపాధ్యాయ
ప్రశాంతి నిలయంలో ఘనంగా
ప్రారంభమైన గ్లోబల్ మహిళా సదస్సు
మూడురోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్కు హాజరైన 18 దేశాల మహిళలు

‘సాయి మిషన్’లో మహిళలదే కీలక పాత్ర