
సడలుతున్న పట్టు
మడకశిర: జిల్లాలోనే మడకశిర నియోజకవర్గంలో పట్టు గూళ్ల పెంపకం అత్యధికంగా ఉంటోంది. ఓ కుటీర పరిశ్రమలా విస్తరించాయి. దాదాపు 14వేల ఎకరాల్లో మల్బరీ తోటలు విస్తరించి ఉన్నాయి. నియోజకవర్గంలోని మడకశిర, అగళి, రొళ్ల, గుడిబండ, అమరాపురం మండలాల్లో దాదాపు 10వేల మంది రైతులు పట్టు పురుగుల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా బైవోల్టిన్, క్రాస్ బ్రీడ్ (సీబీ) రకాల పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు.
తగ్గిన సీబీ పట్టుగూళ్ల ఉత్పత్తి..
కొన్నేళ్ల క్రితం రైతులు సీబీ రకం పట్టుగూళ్ల ఉత్పత్తికి పోటీ పడే వారు. దాదాపు 95 శాతం మంది రైతులు సీబీ రకం పట్టు సాగుకే మొగ్గు చూపేవారు. తర్వాత పట్టు పరిశ్రమ శాఖలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ప్రభుత్వం విదేశీ రకమైన బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తికి విశేషంగా ప్రోత్సాహకాలను అందజేస్తూ వచ్చింది. దీంతో రైతులు సీబీ రకాన్ని వదిలి బైవోల్టిన్ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 5 శాతం మంది రైతులు మాత్రమే సీబీ రకం పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలోనే పట్టుగూళ్ల అమ్మకాలకు కేంద్ర బిందువుగా మారిన హిందూపురం మార్కెట్లో రోజు వారీ అమ్మకాలను పరిశీలిస్తే సీబీ రకం పట్టు గూళ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఈ ఏడాది మే 30 నుంచి ఇప్పటి వరకూ హిందూపురం మార్కెట్లో లావాదేవీలను పరిశీలిస్తే సీబీ రకం పట్టుగూళ్లు కేవలం 44 కిలోలు మాత్రమే అమ్మకానికి రాగా, బైవోల్టిన్ రకం పట్టుగూళ్లు 26,884 కిలోలు వచ్చాయి.
తక్కువ ఖర్చుతో
బైవోల్టిన్ పట్టు గూళ్ల ఉత్పత్తి..
సీబీ రకం పట్టుగూళ్ల సాగుతో పోల్చుకుంటే బైవోల్టిన్ సాగుకు ఖర్చు తక్కువగా ఉంటోంది. బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తికి కూలీల అవసరం చాలా తక్కువ, అంతేకాక బైవోల్టిన్ పట్టు గూళ్ల ఉత్పత్తిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అధికంగా ఇస్తున్నాయి. కిలో బైవోల్టిన్ పట్టుగూళ్లను ప్రభుత్వ మార్కెట్లో విక్రయిస్తే అదనంగా రూ.50 అందుతుంది. సీబీ రకం పట్టుగూళ్లు కిలో పై కేవలం రూ.10 మాత్రమే వస్తుంది. మార్కెట్లో సీబీ రకం కంటే బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర కూడా అధికంగా ఉంటోంది. కిలోపై రూ.150 నుంచి రూ.200 వరకు ధరలో తేడా ఉంటోంది. సీబీ రకం పట్టుగూళ్లు కిలో గరిష్టంగా రూ.400 పలికితే... బైవోల్టిన్ ధర గరిష్టంగా రూ.600 వరకు ఉంటోంది.
కూటమి ప్రభుత్వంలో తప్పని కష్టాలు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిలో పట్టు రైతులకు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు. ప్రధానంగా బైవోల్టిన్ రైతులకు కిలోపై అదనంగా ఇచ్చే రూ.50 ప్రోత్సాహకం అందజేతలో అంతులేని జాప్యం కనబరుస్తోంది. దీంతో రూ.కోట్లల్లో ప్రోత్సాహక బకాయిలు పేరుకుపోయాయి. ప్రోత్సాహక ధనాన్ని మంజూరు చేయాలని కోరుతూ పట్టు రైతుల సంఘం నాయకులు పలుమార్లు విజయవాడకు వెళ్లి ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది.
బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిపై
ప్రోత్సాహకాలు అధికం
సీబీ రకం పట్టుగూళ్లపై
అంతంత మాత్రమే
కూటమి ప్రభుత్వంలో ఏడాదిగా
అందని ప్రోత్సాహకాలు
పట్టు రైతులకు తప్పని కష్టాలు
పట్టు రైతును కష్టాలు వెంటాడుతున్నాయి. పట్టు దారం, పట్టు గూళ్ల ధరలు నిలకడగా ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సర్వాత సరైన ప్రోత్సాహకాలు అందకపోవడం రైతులను కలవరపరుస్తోంది. దీంతో పట్టు సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

సడలుతున్న పట్టు

సడలుతున్న పట్టు

సడలుతున్న పట్టు