
రైతులపై రాజకీయ కక్ష
ధర్మవరం: కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి సామాన్యులపై టీడీపీతో పాటు జనసేన నేతల వేధింపులూ అధికమయ్యాయి. అధికారం అండతో రైతులపైనా కక్ష సాధిస్తున్నారు. తాజాగా ధర్మవరంలో జనసేన నేత చిలకం మధుసూదన్రెడ్డి వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు రైతులను టార్గెట్ చేసి ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరం మండల పరిధిలోని ముచ్చురామి గ్రామానికి చెందిన విశ్వనాథ్రెడ్డి, రవికుమార్ చీనీతోటలు సాగుచేస్తున్నారు. లోఓల్టేజీ సమస్య ఏర్పడి సాగునీరు అందక పోవడంతో 2023 జూన్లో కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం విశ్వనాథ్రెడ్డి రూ.38 వేలు, రవికుమార్ రూ.12,400 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేశారు. వారం రోజుల క్రితం విద్యుత్ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ స్తంభాలు నాటి లైన్ లాగుతుండగా... ధర్మవరం జనసేన పార్టీ ఇన్చార్జ్ చిలకం మధుసూదన్రెడ్డి విద్యుత్ అధికారులకు ఫోన్ చేశారు. వారిద్దరూ వైఎస్సార్సీపీ కార్యకర్తలనీ, వారికి కొత్త కనెక్షన్ ఇవ్వకూడదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పనులు చేస్తున్న వారు ఉన్నఫలంగా వెనుతిరిగారు. ఎందుకని బాధిత రైతులు ప్రశ్నిస్తే... ఒకసారి జనసేన ఇన్చార్జ్ను కలవమని అధికారులు చెప్పారు. వారంరోజులుగా విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోవడంతో... ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఫలితం లేకుండా పోయింది. కేవలం తాము వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే కారణంతో జనసేన ఇన్చార్జ్ తమ పొలంలో ట్రాన్స్ఫార్మర్ బిగించకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. సాగునీరందక చీనీతోట ఎండిపోతున్నా... అధికారులు కూడా రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడం అన్యాయమని వాపోతున్నారు.
వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై జనసేన నాయకుడి దుర్మార్గపు చర్య
విద్యుత్ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్
ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి
పంటలు ఎండిపోతున్నాయని
బాధిత రైతుల ఆవేదన

రైతులపై రాజకీయ కక్ష