మండల కేంద్రం ముదిగుబ్బలో 30 పడకల ఆస్పత్రి కలగా మారింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే సత్య కుమార్ యాదవ్ 30 పడకల ఆస్పత్రిగా మారుస్తానని, ముదిగుబ్బకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన గెలిచి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు
స్వీకరించి ఏడాది అవుతోంది. అయినా ఏ ఒక్క హామీనీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు.
ముదిగుబ్బ: రాష్ట్రంలోనే అతి పెద్ద మండలం ముదిగుబ్బ. 1964లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఏర్పాటు చేశారు. ఆరు పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రస్తుత మండల జనాభా 80వేల దాకా ఉంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు ముదిగుబ్బ పీహెచ్సీని సందర్శించినపుడు 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయినా 30 పడకల సామర్థ్యం గల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతారేమోనని ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్ఎన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో నలుగురు డాక్టర్లు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న ఇద్దరిలో ఒకరు 104 వైద్య సేవలకు వెళ్లాల్సి ఉంటుంది. స్టాఫ్నర్స్లు పేరుకు ముగ్గురు ఉన్నప్పటికీ.. డిప్యుటేషన్పై వేరే చోట పనిచేస్తున్నారు. రోజూ 300 మంది ఓపీ సేవల కోసం వస్తుంటారు. అందుబాటులో ఒక డాక్టరే ఉండడం వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం నైపుణ్యత కలిగిన డాక్టర్లు లేకపోవడంతో ఆపరేషన్లు చేయడం లేదు. దీంతో ఎవరైనా ఆపరేషన్లు చేయించుకోవాలనే వారు అటు కదిరి గానీ ఇటు అనంతపురం గానీ వెళ్తున్నారు.
రోడ్డు ప్రమాద కేసులు ఎక్కువే..
205 జాతీయ రహదారి ముదిగుబ్బ మీదుగా పోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ మెరుగైన వైద్య సేవలు లేక ప్రమాదాలు జరిగిన వారికి ప్రఽథమ చికిత్స చేసిన వెంటనే బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి గానీ అనంతపురం ఆస్పత్రికి గానీ రెఫర్ చేస్తుంటారు. కొన్ని సమయాల్లో అక్కడికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. దీంతో పాటు మలకవేమల క్రాస్లో మరొక పీహెచ్సీ కూడా ఉంది. అయితే ఆ పీహెచ్సీలో 5 సచివాలయాల పరిధిలోని వారికి మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయి. మిగిలిన 17 సచివాలయాలు ముదిగుబ్బ పీహెచ్సీ పరిధి కిందే ఉన్నాయి. మండల వ్యాప్తంగా 13 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా.. అందులో కొడవండ్లపల్లి, మల్లేపల్లి, సంకేపల్లి ఉప కేంద్రాలలో సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
30 పడకల ఆసుపత్రి వస్తే
ముదిగుబ్బలో 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఐదారుగురు వైద్యులు వస్తారు. దంత, కంటి, గైనకాలజీ తదితర విభాగాల సేవలు అందుబాటులోకి వస్తాయి. తగినన్ని మందులు నిల్వ ఉంచుతారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ఇక్కడే చికిత్స చేయవచ్చు. తక్షణమే వైద్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉండదు.
ముదిగుబ్బలో మెరుగైన వైద్యం మిథ్యే
80 వేల జనాభాకు ఆరు పడకల
ఆస్పత్రే దిక్కు
అప్గ్రేడ్ చేస్తామన్న మంత్రి సత్యకుమార్ హామీ ఏడాది గడిచినా అమలుకు
నోచుకోని వైనం
కల సాకారమయ్యేనా..?
ముదిగుబ్బలో 30 పడకల ఆస్పత్రి చాలా అవసరం. రాష్ట్రంలో అతి పెద్ద మండలంగా పేరున్న ముదిగుబ్బలో అందుకు తగినట్టుగా ఆస్పత్రిని తీర్చిదిద్దుతామని మంత్రి సత్యకుమార్యాదవ్ హామీ ఇచ్చారు. ఇప్పటికి ఏడాది అయ్యింది. హామీ మేరకు ఆస్పత్రిని అప్గ్రేడ్ చేసి.. మెరుగైన వైద్య సేవలందిస్తే బాగుంటుంది.
– మల్లికార్జున, ఎంపీటీసీ, ముదిగుబ్బ
వైద్య సేవలు మెరుగుపడాలి
ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఒకరు 104 వాహనానికి వెళ్తుతున్నారు. ఉన్న ఒక్క డాక్టర్తో పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. పీహెచ్సీలో మందుల కొరత కూడా ఉంది. తగినంతమంది డాక్టర్లను అందుబాటులో ఉంచి నాణ్యమైన వైద్య సేవలందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మీ సేవ చంద్ర, ముదిగుబ్బ
30 పడకల ఆస్పత్రి
30 పడకల ఆస్పత్రి