
2,59,895 జిల్లాలోని జాబ్ కార్డులు
ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు చెందిన వెంకటరమణ కుటుంబం ఉపాధి హామీ పథకం ద్వారానే జీవనం సాగిస్తోంది. కూలి డబ్బుతోనే పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించుకుంటున్నారు. ఈ నెల 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయితే వీరికి ఏప్రిల్ నుంచి ఉపాధి కూలి డబ్బులు చెల్లించక పోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది. ఇక పిల్లల చదువు ఎట్లా..? అని ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది.
..జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది ఉపాధి కూలీల పరిస్థితి ఇదే. మూడు నెలల కూలి డబ్బులు బకాయిగా ఉండటంతో అప్పులు చేసి పూట గడుపుకుంటున్నారు. చాలా మంది బెంగళూరుకు వలస వెళ్లి ‘ఉపాధి’ పొందుతున్నారు.
బిల్లులు రావడం లేదు
రోజంతా కష్టపడితే రూ.250 కూలి వస్తుంది. ఆ డబ్బులు కూడా 3 నెలల నుంచి ఇవ్వడం లేదు. ఆ డబ్బుతోనే పూట గడిచేది. అవి కూడా ఇవ్వకపోతే ఎలా? నెలల తరబడి డబ్బులివ్వకపోతే మేం ఏం తినాలి..ఎట్లా బతకాలి?. అదిగో.. ఇదిగో అనడమే గానీ.. ఇంత వరకూ డబ్బులు జమ చేసింది లేదు. –శంకరమ్మ, బయగారిపల్లి,
తలుపుల మండలం
అప్పు చేసి పూట
గడుపుకుంటున్నాం
ఎండలు మండుతున్నా కరువు పనులకు వెళ్తున్నాం. ఇంతకు ముందు వారానికి ఒకసారి మస్టర్లు చూసి కూలి డబ్బులు ఇచ్చే వాళ్లు. ఇప్పుడు మూడు నెలలు అవుతున్నా.. అతీగతీ లేదు. ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాం. ఉపాధి డబ్బులొస్తాయన్న ధైర్యంతో అప్పుచేసి పూట గడుపుకుంటున్నాం.
–జె.రామన్న, ఉప్పార్లపల్లి,
నల్లచెరువు మండలం
పెండింగ్ వాస్తవమే
ఉపాధి హామీ కూలీలకు ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి దాకా కూలి డబ్బులు చెల్లించాల్సిన మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా రూ.58.80 కోట్ల కూలి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయి. ప్రియారిటీ ప్రకారం వారం రోజుల్లో కూలీల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–కె.విజయ ప్రసాద్, పీడీ, డ్వామా
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
కదిరి: వలసలను నివారించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గాడి తప్పింది. గతంలో నిరుపేదలకు ఆదరవుగా ఉన్న ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంరాగానే అస్తవ్యస్తంగా మారింది. చేసిన పనులకు 3 నెలలుగా వేతనాలు అందక ఉపాధి కూలీలు పస్తులతో అలమటిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారం రోజుల్లో ఉపాధి కూలి డబ్బులు చెల్లించాలి. గరిష్టంగా 15 రోజుల్లోపే వారి పనికి సంబంధించిన మొత్తం నేరుగా ఖాతాలో జమ చేయాల్సి ఉన్నా..ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. మరోవైపు ఉపాధి హామీ సిబ్బందికీ వేతనాలు మూడు నెలలుగా పెండింగ్లో ఉండటంతో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పేరుకుపోయిన బకాయి
జిల్లాలోని 2,59,895 కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్ కార్డులుండగా... 4,76,217 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రసుత్తం 2.13 లక్షల కార్డులు యాక్టివ్లో ఉండగా..3.90 లక్షల మంది క్రమం తప్పకుండా ఉపాధి కూలి పనులకు వెళ్తున్నారు. వీరికి 3 నెలలుగా కూలి డబ్బులు అందడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి దాకా రూ.58.80 కోట్ల కూలి డబ్బులు బకాయి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మెటీరియల్ కేటగిరీలో గ్రామాల్లో సిమెంటు రోడ్లు తదితర పనులు చేసిన వారికి కూడా బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పర్యవేక్షణకు మండల కంప్యూటర్ సెంటర్(ఎంసీసీ)లో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు నిత్యం కూలీలతో పాటు ఉంటూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా 3 నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో వీరి పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
మితిమీరిన రాజకీయ జోక్యం
గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ అమలులో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లలను ఏకపక్షంగా తొలగించారు. వారి స్థానంలో కూటమి పార్టీల సానుభూతి పరులను నియమించారు. గ్రామాల్లో పేదలకు పనులు అప్పగించే విషయంలోనూ పార్టీలు చూస్తున్నారు. అధికార పార్టీకి సహకరించిన వారికి మాత్రమే పనులు అప్పగించాలని అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. దీంతో చాలా మంది స్థానికంగా పనులు దొరక్క..దొరికినా కూలీలు సకాలంలో అందక... గ్రామాలు విడిచి బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
జిల్లాలో ‘ఉపాధి’ దుస్థితి
3 నెలలుగా కూలీలకు అందని వేతనాలు
రూ.58.80 కోట్ల
కూలి డబ్బులు బకాయి
ఒక్కో కూలీకి సగటున
రూ.20 వేలు పెండింగ్
ఉపాధి సిబ్బందికీ 3 నెలలుగా
మంజూరుకాని జీతాలు
4,76,217
ఉపాధి కూలీల సంఖ్య
రూ.58.80 కోట్లు
కూలీలకు బకాయిగా
ఉన్న మొత్తం

2,59,895 జిల్లాలోని జాబ్ కార్డులు

2,59,895 జిల్లాలోని జాబ్ కార్డులు

2,59,895 జిల్లాలోని జాబ్ కార్డులు