
అప్పులోళ్ల అమానుషం
హిందూపురం: అప్పు కట్టాలంటూ ఇంటికి తాళం వేశారు. కుటుంబ సభ్యులను బయటకు గెంటేశారు. అప్పు తిరిగి చెల్లించే దాకా ఇంటి తాళం ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈ అమానుష ఘటన హిందూపురం మండలం గోళాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు... గ్రామానికి చెందిన గంగమ్మ భర్త అనారోగ్యంతో ఐదేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి కూలి పనులకు వెళుతూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. అయితే..నీ భర్త తమతో అప్పు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బంధువులు గంగమ్మపై ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అంజక్క కుమారుడు సుధాకర్ వేళాపాళా లేకుండా ఇంటి వద్దకు వచ్చి బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె గతంలో హిందూపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పట్లో మందలించడంతో సుధాకర్ కొన్ని రోజులు మిన్నకుండిపోయాడు. మళ్లీ ఇప్పుడు వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే శనివారం గంగమ్మ ఇంటికి తాళం వేశాడు. అప్పు తిరిగి చెల్లించే వరకు తాళం ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో గంగమ్మ, పిల్లలు నిస్సహాయస్థితిలో చాలాసేపు ఇంటి బయటే కూర్చుండిపోయారు. తన భర్తకు అప్పు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని, అయినా ఇబ్బంది పెడుతున్నారని గంగమ్మ వాపోయారు. చివరకు అధికారులకు, పోలీసులకు విషయం తెలియడంతో సుధాకర్ను మందలించి తాళం చెవి ఇప్పించారు.
అప్పు చెల్లించాలని ఇంటికి తాళాలు
ఆరుబయటే బాధితులు