
రైతులపై సోలార్ పిడుగు
అగళి: ‘మీ భూములు.. మా వ్యాపారం’ అంటూ రైతులపై కూటమి సర్కార్ సోలార్ పిడుగులు కురిపిస్తోంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పేరుతో వేలకు వేల ఎకరాల భూ సేకరణకు సిద్ధమైంది. ఈ క్రమంలో పంటల సాగుకు అనువుగా ఉండే భూములను సైతం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది.
రెండు నియోజకవర్గాల్లో 20 వేల ఎకరాలు
మడకశిర, హిందూపురం నియోజకవర్గాల పరిధిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దాదాపు 20 వేల ఎకరాల భూ సేకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో అగళి మండలంలో పి బ్యాడగేర 66 ఎకరాలు, హెచ్ డీ హళ్లి రెవెన్యూ పరిధిలో 2440 ఎకరాలు, ఇనగలూరులో వెయ్యి ఎకరాలు, రావుడి పంచాయతీలో 1,500 ఎకరాల భూములను సేకరించేందుకు పరిశీలించారు. హిందుపురం మండలంలో మలుగూరు, చలివెందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి ప్రాంతాల్లో 2,500 ఎకరాలు, లేపాక్షి మండలం కొండూరు, లేపాక్షి ప్రాంతాల్లో 2 వేల ఎకరాలు, మడకశిర మండలం హరేసముద్రం, బుల్లసముద్రం, క్యాంపురం, రాయపురం, ఉప్పిడిపల్లి, మనూర ప్రాంతాల్లో 5వేల ఎకరాలు, రొళ్ల మండలంలో 2,500 ఎకరాలు, గుడిబండ మండలంలో 2వేల ఎకరాల స్వాధీనం లక్ష్యంగా అధికారులు కార్యాచరణ చేపట్టారు.
సాగు భూములే లక్ష్యంగా..
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రధానంగా బీడు భూములను ఎంపిక చేయాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా సారవంతమైన సాగు భూములను అధికారులు గుర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు భూములను వదిలి వేయాలంంటూ ఇప్పటికే ఎక్కడికక్కడ రైతులు ఆందోళలను చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వంలో కనికరం లేకుండా పోయింది. రైతులకు తెలియకుండానే వారి భూముల్లో అధికారులు సర్వే ప్రక్రియ చేపట్టారు. బీడు భూములను మాత్రమే గుర్తిస్తున్నట్లుగా నమ్మబలుకుతూ.. వాటికి సమీపంలో ఉన్న రైతుల పంట పొలాలనూ సర్వే చేసి గుర్తిస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కాగానే రైతుల నుంచి ఆ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫలితంగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వందలాది కుటుంబాలు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లక తప్పదని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లీజులో తిరకాసులెన్నో..
సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో రైతుల భూములను లీజు పేరుతో కంపెనీ చేతుల్లో పెట్టేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ ప్రక్రియతో ఆయా భూములపై తమకు తెలియకుండానే హక్కును రైతులు కోల్పోనున్నారు. లీజు తర్వాత ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లలేని పరిస్థితి. లీజుకు తీసుకున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కంపెనీ యాజమాన్యం రుణాలు పొందే వెసులుబాటు ఉంది. కంపెనీ తీసుకున్న రుణాలు చెల్లించకపోతే ఆ భారం రైతులపై పడుతుంది. లీజు తర్వాత ఆ భూములు సాగు యోగ్యత కోల్పోతాయి. అందులోని సోలార్ సామగ్రిని ఎవరు తొలగించాలి. ఎక్కడ పడేయాలి. వీటికి అయ్యే ఖర్చును ఎవరు భరించాలి అనే విషయాలేవీ ఎంఓయూలో ఉండవు. వీటిపై రైతులకు అవగాహన కూడా ఉండదు. ఆఖరుకు లీజు ముగిసిన తర్వాత పొలం విక్రయించుకోవాలన్నా కుదరదు. కంపెనీ లీజు పొడించాలనుకుంటే రైతు ఒప్పుకుని తీరాల్సిందే. ఈ లెక్కన రైతుకు 20 ఏళ్ల తర్వాత కూడా తన భూమిపై హక్కు ఉండదని స్పష్టమవుతోంది.
మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో జోరుగా సర్వేలు
రైతులకు తెలియకుండానే వారి భూముల్లో వివరాల సేకరణ
భూములు ఇచ్చేది లేదంటూ
అన్నదాతల ఆందోళనలు

రైతులపై సోలార్ పిడుగు