
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
పెళ్లి కాలేదన్న కారణంతో ఓ యువకుడు బలవన్మరణానికి
పాల్పడగా... తాగుడు మానలేక మరో యువకుడు, కుటుంబ
కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు.
● పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లిలో ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన గంగాధరప్ప, సుజాతమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసులు(20) ఆత్మహత్య చేసుకున్నాడు. తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తుండేవాడు. తన అక్క లావణ్య భర్త కృష్ణ మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. చిన్న వయసులోనే అక్క భర్తను కోల్పోవడంతో మనోవేదనకు లోనై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులందరూ గురువారం సమీప బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాసులు ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ రంగడు యాదవ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి అన్న అభి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
● పెనుకొండ రూరల్: మండలంలోని గోనిపేటకు చెందిన బోయ శివకుమార్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. శివకుమార్కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఏ ఒక్కటీ కుదరకపోవడంతో మనస్తాపానికి గురైన అతను బుధవారం రాత్రి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కుటంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం ఉదయం గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న శివకుమార్ను గుర్తించిన స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
● లేపాక్షి: మండలంలోని చోళసముద్రం పంచాయతీ నాగానపల్లికి చెందిన ఆదినారాయణప్ప భార్య సవిత(35) ఆత్మహత్య చేసుకుంది. వివాహమై పదేళ్లు కావస్తున్నా... సంతానం కలగలేదు. ఈ క్రమంలోనే భర్త తాగుడుకు బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. భర్తలో మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సవిత... బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పైకప్పునకు తాడుతో ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను హిందూపురంలోని జిల్లాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.