
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
గోరంట్ల: ‘వెన్నుపాటు’ అనే మాట వినిపిస్తేనే చంద్రబాబు గుర్తుకు వస్తారని, వెన్నుపోటుకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ పగడాల వెంకటేశు అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...చందబ్రాబు అసమర్థ పాలనను వివరించడంతో పాటు అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించేందుకే బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలో పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబు
‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో చదువుకొనే ప్రతి బిడ్డకూ ఏడాదికి రూ.15 వేలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు... అధికారం చేపట్టి ఏడాదవుతున్నా ఇప్పటికి ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఉషశ్రీచరణ్ దుయ్యబట్టారు. అలాగే అడపడుచుకు నెలకు రూ.1,500 ఇస్తానని మోసం చేశారన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు...నేడు వాటి గురించే మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి అలవాటు పడ్డారన్నారు. గతంలో బిడ్డనిచ్చిన సొంతమామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడచి అధికారం చేపట్టారని, ఆ తర్వాత ప్రతి ఎన్నికలోనూ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి రాగానే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేదలను వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి చేపడుతున్న యుద్ధంలో ప్రతి కార్యకర్త ముందుండాలని ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. అంతకుముందు ఆమె పార్టీ శ్రేణులతో కలిసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాంనాయక్, పార్టీ పట్టణ కన్వీనర్ మేదర శంకర, పార్టీ నాయకులు చరణ్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, ట్రెజరర్ బాలన్నగారిపల్లి రామకృష్ణారెడ్డి, మండలంలోని పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
హామీలిచ్చి మోసం చేయడం
ఆయన నైజం
బాబు నయవంచనను ప్రజలకు
వివరించేందుకే ‘వెన్నుపోటు దినం’
పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొనాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్