
యోగాతో రుగ్మతలు దూరం
● కలెక్టర్ టీఎస్ చేతన్
కదిరి: యోగా సాధనతో శారీరక, మానసిక రుగ్మతలు దూరమవుతాయని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. బుధవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వీధిలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరితో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు శ్వాసకోశ వ్యాధులు వంటి వాటిని అదుపు చేయడంలో యోగా ఎంతో సాయపడుతుందన్నారు. ఇందుకోసం ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుంటే మంచిదన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ... మనసు, శ్వాస, వ్యాయామమే యోగా అన్నారు. రోజూ యోగా సాధన చేస్తే అనేక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, మున్సిపల్ చైర్ పర్సన్ దిల్షాదున్నీసా, వైస్ చైర్మన్లు రాజశేఖరాచారి, సుధారాణి, ఆర్డీఓ శర్మ, టూరిజం అధికారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.