
‘సీమ’ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి
హిందూపురం టౌన్: గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పటం అనాలోచితమైన చర్య అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. అంతకంటే ముందు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో జలసాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం రూపొందించిన పథకం తప్ప ప్రజా ప్రయోజనాలను అది నెరవేర్చలేదన్నారు.
రూ.80 వేల కోట్లు ఖర్చా...?
హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగంగ తదితర రాయలసీమ ప్రాజెక్టులు ప్రారంభించి 37 ఏళ్లు దాటినా నేటికీ రిజర్వాయర్లు, కాలువ పనులు పూర్తి కాలేదని బొజ్జ దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.40 వేల కోట్లు కావాలని, వాటికే దిక్కులేని పరిస్థితుల్లో రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి జలాలను బనకచర్లకు తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటంలో అర్థం లేదన్నారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు కూడా కోస్తా ప్రయోజనాలు కాపాడడం కోసమే గానీ, రాయలసీమ ప్రయోజనాల కోసం కాదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల అటు కృష్ణా జలాల్లోనూ కోత పడే ప్రమాదం ఉందన్నారు.
హంద్రీ–నీవాకు లైనింగ్ రద్దు చేయాల్సిందే..
రాయలసీమలో 90 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా సీఎం చంద్రబాబు ప్రతి ఎకరాకు నీళ్లిస్తానని చెబుతున్నారని, ఎలా ఇస్తారో చెప్పాలని బొజ్జ దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికి తన దగ్గర బ్లూ ప్రింట్ ఉందంటున్న సీఎం.. దాన్ని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే హంద్రీ–నీవా మెయిన్ కాలువ లైనింగ్ రద్దుచేయడంతో పాటు పదివేల క్యూసెక్కులకు వెడల్పు చేసి పిల్ల కాలువల ద్వారా రాయలసీమలోని ఆరు లక్షల ఎకరాలకు సాగునీరుఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి,తెలుగు గంగ తదితర రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన రూ.50 వేల కోట్లను విడుదల చేయించి యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, జల సాధన సమితి నాయకులు సడ్లపల్లె చిదంబరెడ్డి, రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి, జమీల్, అమానుల్లా, ఆదినారాయణ, రాజశేఖర్ రెడ్డి, తూముకుంట పారిశ్రామిక వాడ కార్మిక నాయకులు రవి, రమణ, హరి, తిప్పే స్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి – బనకచెర్ల వల్ల
రాయలసీమకు ఒరిగేదేమీలేదు
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి