సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Jun 1 2025 12:22 AM | Updated on Jun 1 2025 12:22 AM

సీజనల్‌ వ్యాధులపై  అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

ప్రశాంతి నిలయం: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య, ఆరోగ్యశాఖతో పాటు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో జిల్లా అధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల కలిగే ఇబ్బందులు...ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కలెక్టర్‌ చేతన్‌ మాట్లాడుతూ... జిల్లాలో వర్షాల కారణంగా చెరువులు, కాలువలకు గండి పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో రోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలని, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ, విషజ్వరాలు విజృంబించే అవకాశం ఉందని, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్లోరినేషన్‌ చేయడంతో పాటు నీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణ రెడ్డి, డీపీఓ సమత, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు.

11 మండలాల్లో వర్షం

పుట్టపర్తి అర్బన్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ జిల్లాలోని 11 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కదిరి మండలంలో 24.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక అమడగూరు మండలంలో 15.4 మి.మీ, నల్లమాడ 10, గాండ్లపెంట 7.8, ఓడీచెరువు 5.4, నల్లచెరువు 5.2, తనకల్లు 4.2, గుడిబండ 3.2, పెనుకొండ 2.8, తలుపుల 2.2, ఎన్‌పీకుంట మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

న్యూస్‌రీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement