
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ శ్రీధర్
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు కేంద్రం మేనేజర్ రాజశేఖర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు యాంబర్ ప్రాజెక్టు కింద కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ సేల్స్ అసోసియేట్స్, జాబ్రోల్స్తో పాటు కంప్యూటర్ శిక్షణ, సాఫ్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు అనంతపురంలోని రాజురోడ్డులో ఉన్న ఎక్సల్స్ లర్నింగ్ సొల్యూషన్ కార్యాలయంలో నేరుగా లేదా 93981 54460, 75696 59964లో సంప్రదించవచ్చు.
భార్యను హతమార్చిన భర్త
చెన్నేకొత్తపల్లి: కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. కోనకణ్వాశ్రమం వద్ద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక ఎస్ఐ శ్రీధర్ తెలిపిన మేరకు.. మండలంలోని న్యామద్దల గ్రామానికి చెందిన పూజారి నరసింహులు, మంజుల (30) దంపతులు. కొంత కాలంగా మంజుల అనారోగ్యంతో బాధపడుతోంది. నరసింహులు దీన్ని అవమానంగా భావించాడు. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు భార్య అడ్డుగా నిలిచిందని, ఆమెను అంతమొందించాలని భావించాడు. మూడు రోజుల క్రితం భార్యను బైకుపై ఎక్కించుకుని కోనకణ్వాశ్రమం వద్దకు తీసుకువెళ్లి గొంతు నులుమి హత్య చేశాడు. అక్కడే కాలువలో పడేసి ఇంటికి వచ్చాడు. శనివారం అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన వారు న్యామద్దల గ్రామవాసిగా గుర్తించారు. మృతురాలి తల్లి అంజినమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఔను అది హత్యే!
● హెచ్చెల్సీలో కొట్టుకు వచ్చిన
మృతదేహం ఆచూకీ లభ్యం
● హతుడిని బళ్లారి వాసిగా
గుర్తించిన పోలీసులు
● వివాహేతర సంబంధం
కారణంగానే హత్య?
బొమ్మనహాళ్: హెచ్చెల్సీలో కొట్టుకు వచ్చిన మృతదేహం ఆచూకీ లభ్యమైంది. యువకుడిని హత్య చేసి, కాళ్లూచేతులు కట్టేసి హెచ్చెల్సీలో పడేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఉంత కల్లు శివారులోని హెచ్చెల్సీ 119/500 కిలోమీటర్ వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ యుగంధర్, ఎస్ఐ శివ... శనివారం ఉదయం అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. హత్య చేసి కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి హెచ్చెల్సీ ప్రధాన కాలువలో పడేసినట్లుగా నిర్ధారించారు. లభ్యమైన ఆధారాలను బట్టి హతుడిని బళ్లారిలోని మేదార్ కేతయ్య నగర్ (ఎమ్కే నగర్)కు చెందిన ఎం.వినోజ్ (30)గా గుర్తించారు. సండూరు వద్ద ఎస్ఎండీసీ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తుండేవాడు. వివాహేతర సంబంధాల కారణంగానే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీఆర్వో కుళ్లాయి స్వామి నుంచి స్వీకరించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బీఈడీ ఫలితాలు విడుదల
అనంతపురం: ఎస్కేయూ పరిధిలో బీఈడీ (దూరవిద్య) రెండో సంవత్సరం ఫలితాలు శనివారం ఆ వర్సిటీ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. మొత్తం 338 మంది పరీక్ష రాయగా 325 (96.15 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్కు ఈ నెల 21వ తేదీ వరకూ గడువునిచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఏపీ విజయపరంపర
అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సబ్ జూనియర్ బాలుర నేషనల్ పుట్బాల్ చాంపియన్షిప్–2023 పోటీల్లో ఏపీ జట్టు విజయ పరంపరను కొనసాగిస్తోంది. శనివారం లక్షద్వీప్తో తలపడిన ఏపీ జట్టు 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. జట్టులో సాత్విక్, సాదిక్ వలి, కియాన్స్ చెరో గోల్ సాధించారు. హిమాచల్ప్రదేశ్తో తలపడిన సిక్కిం జట్టు 3–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. త్రిపురపై ఏకంగా 11 గోల్స్తో బిహార్ జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ మ్యాచ్లో త్రిపుర జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. అలాగే అండమాన్నికోబార్పై 9–0 గోల్స్ తేడాతో ఉత్తరాఖండ్ జట్టు విజయం సాధించింది.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు (ఇన్సెట్) వినోజ్ (ఫైల్)
