విద్యుదాఘాతంతో యువకుడి మృతి

శ్రీనాథ్‌రెడ్డి మృతదేహం   - Sakshi

తాడిమర్రి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మరిమేకలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఉప్పలూరు కృష్ణారెడ్డి కుమారుడు శ్రీనాథ్‌రెడ్డి (21) ధర్మవరంలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తమ పొలంలో సాగు చేస్తున్న వేరుశనగ, బెండ పంటలకు నీరు పెట్టేందుకు మంగళవారం ఉదయం శ్రీనాథ్‌ రెడ్డి వెళ్లాడు. మోటర్‌ పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కి తీగలను సరిచేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే తాడిమర్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఎస్‌ఐ లక్ష్మినారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top