● అక్రమంగా బైరెటీస్ రవాణా
● వాహనాల స్వాధీనం
● పోలీసుల పాత్రపై పలు అనుమానాలు
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలం వెంకటాద్రిపాళెం పరిధిలోని ఓ క్వారీ నుంచి అనుమతి లేకుండా బైరెటీస్ ఖనిజాన్ని తరలిస్తున్న 8 వాహనాలను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. లీజు అయిపోయిన క్వారీలో నిల్వ ఉన్న ఖనిజాన్ని ఓ వ్యక్తి ముందుస్తుగా స్థానిక అధికారులతో అవగాహన కుదుర్చుకుని అక్రమంగా తరలించే పక్రియ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఒక హోంగార్డును పంపగా లోడుతో ఉన్న రెండు లారీలను మోటచింతలపాళెంలో పెట్రోల్ బంక్ వద్ద ఆపారు. కొంతసేపు తర్వాత వాహనాలను వదిలేశారు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నివాసముంటున్న పక్కనే ఓ వేబిడ్జి దగ్గర సదరు లారీల్లో ఉన్న బైరెటీస్ను ఇతర లారీల్లో లోడ్ చేస్తుండగా అనుమానం వచ్చిన సిబ్బంది ఎమ్మెల్యే సురేష్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానిక కలిగిరి సీఐ సుబ్బారావుకి చెప్పారు. సీఐ కలిగిరి ఎస్సై లతీఫున్నీసాని పంపి లారీలు వెళ్లకుండా అదుపులో ఉంచుకున్నారు. తర్వాత సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి 8 లారీలను స్వాధీనం చేసుకోవాలిని పోలీసులకు చెప్పారు. గురువారం రాత్రి వరకు వాహనాలను వదల్లేదు. అవి అధికార పార్టీ వ్యక్తులకు చెందినవిగా ప్రచారం జరగడంతో కావడంతో పైరవీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వింజమూరు ఎస్సై మాదాల ఉమామహేశ్వరరావును వివరణ కోరగా సరైన పత్రాలు లేకుండా బైరెటీస్ ఖనిజాన్ని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పత్రాలు సమర్పిస్తే వదిలివేస్తామన్నారు. లేకపోతే మైనింగ్ వారికి అప్పగిస్తామని తెలిపారు. అయితే అనుమతి లేకుండా ఖనిజాన్ని తలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్న వెంటనే కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ జాప్యం చేస్తుండటంతో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఈ అంశం చర్చినీంశంగా మారింది.


