అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి 253వ గంధ మహోత్సవం మంగళవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది. మాజీ పీఠాధిపతి షా గులాం నక్ష్బంద్ హఫీజ్ పాషా స్థానిక మహల్లో తొలుత గంధం ఎత్తారు. దర్గా కార్యాలయం నుంచి ఈఓ మహమ్మద్ హుస్సేన్ గంధానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలను అందజేశారు. ఫకీరుల డప్పు వాయిద్యాలు, నవరంగ్ మేళాలు, బ్యాండ్ మేళాలు, బాణసంచా పేలుళ్ల మధ్య పూల పల్లకితో గంధం, పూల చద్దర్లు, గలేఫులను ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు. హజరత్ వారి సమాధికి గంధం పట్టించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గంధాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
రెండోసారి..
కోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి సమయంలో ఎస్జీఎన్ ఫయాజ్ అహ్మద్ ఇంటి వద్ద కూడా దర్గా నుంచి తీసుకొచ్చిన గంధాన్ని హజరత్ వారి సమాధికి పట్టించి భక్తులకు పంపిణీ చేశారు. ఒకేరోజు రెండు వేర్వేరు మహళ్ల నుంచి గంధం దర్గాకు చేరుకోవడంతో భక్తుల్లో అయోమయం నెలకొంది.
ప్రశాంతంగా..
గంధ మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సంగం, ఆత్మకూరు సీఐలతోపాటు పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


