నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ ఆవరణలోని కార్గో పాయింట్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 35 కిలోల వానపాములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. విచారణలో అవి అనంతసాగరం మండలంలోని ఓ ఎరువుల తయారీ సంస్థకు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం అనుమతులతోనే వాటిని రవాణా చేశారా?, లేదా అనే అంశంపై డీఎఫ్ఓ మహబూబ్బాషా ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. సదరు పార్శిల్స్ విజయవాడ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు జి.వెంకటేశ్వర్లు, పీవీ ప్రసాద్, కేఎన్రావు తదితరులు పాల్గొన్నారు.


